చీర లాగారు.. గొంతు పిసికారు! అసెంబ్లీలో హరీష్ రావు ఆగ్రహం, స్పీకర్ సీరియస్
తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనలు, స్పీకర్ స్థానాన్ని అవమానించారనే ఆరోపణల చుట్టూ మంగళవారం నాటి సభ అత్యంత ఉద్రిక్తంగా మారింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వేర్వేరు అంశాలపై నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల రిబ్బన్లు ధరించి మండలికి హాజరై తమ నిరసనను తెలియజేశారు.
'గౌరవ సభ.. కౌరవ సభగా మారింది': హరీష్ రావు తీవ్ర ఆగ్రహం!
సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "నిన్న అసెంబ్లీ ఆవరణలో మా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి తీవ్రంగా అవమానించారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, రక్షణ కల్పించాల్సిన పోలీసులే రివర్స్ కేసులు పెట్టారు" అని హరీష్ రావు ఆరోపించారు. ఈ ఘటనను యావత్ తెలంగాణ మహిళలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. చట్టసభ గౌరవ సభగా ఉండాల్సింది పోయి కౌరవ సభగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.

'ముందు నా సంగతి తేల్చండి'.. భావోద్వేగానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్!
హరీష్ రావు వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మీరు లొల్లి పెడితే నేను భయపడను" అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మహిళా నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "సబితమ్మ, సునీతమ్మ, కోవా లక్ష్మీ అంటే నాకు అత్యంత గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన ఘటనపై నేనే స్వయంగా విచారణ జరిపించాలని అధికారులను కోరాను" అని తెలిపారు. అయితే, సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. "హరీష్ రావు.. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడు! నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, నా కన్న తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. ముందు ఆ సంగతి తేల్చండి" అని అసహనం వ్యక్తం చేశారు.
హరీష్రావు..
— Congress for Telangana (@Congress4TS) September 8, 2026
నీ తల్లిని అనలేదు... నా తల్లిని అన్నారు
నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు#TelanganaAssembly #Assembly pic.twitter.com/a0acVPCqwu
తప్పు జరిగితే చర్యలు తప్పువు: మంత్రి శ్రీధర్ బాబు స్పష్టత!
ఈ వివాదంపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రే పోలీసు అధికారులను ఆదేశించారని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి పనిచేసిన అనుభవం తమకు ఉందని, తమ ప్రభుత్వానికి మహిళల పట్ల పూర్తి గౌరవం ఉందన్నారు. విచారణలో తప్పు జరిగినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై, ఆయన తల్లిదండ్రులపై బీఆర్ఎస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకపోవడం సరికాదని, కేవలం విచారం వ్యక్తం చేసి సరిపెట్టుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీ నిరసనలు.. విచారణకు డిమాండ్!
మరోవైపు, 22ఏ భూముల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు కూడా సభలో నినాదాలు చేశారు. మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నామినేటెడ్ నేతలు పట్టుబట్టడంతో సభలో తీవ్ర నిరసన వాతావరణం నెలకొంది.














Click it and Unblock the Notifications
