7గంటలపాటు సుదీర్ఘ భేటీ: కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలివే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిభవన్లో శుక్రవారం సుదీర్ఘంగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 50అంశాలు అజెండాలో ఉండటంతో సుమారు 7గంటల పాటు సమావేశం కొనసాగింది.
పంచాయతీ రాజ్ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గ్రామ పంచాయతీల పాలక మండలిలు ఆగస్టు 1తో ముగియనున్న నేపథ్యంలో 2నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం రాష్ట్రంలో అమలులోకి రానుంది.

పంచాయతీ కార్యదర్శుల భర్తీ
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో కొలువుదీరనున్నాయి. అయితే, నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ఆయా గ్రామ పంచాయతీలన్నింటికీ ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక కార్యదర్శి ఉండాలనే లక్ష్యం మేరకు అదనంగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల భర్తీకి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

బీసీ జన గణన
బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసేందుకు వీలుగా తక్షణమే బీసీ జనాభా గణన చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీ గురుకులాల పాఠశాలలు 119 ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వాటితో పాటు అక్కడ సిబ్బంది నియామకంపైనా చర్చించారు.

రాజకీయ పార్టీలకు జిల్లాల్లో స్థలాలు
అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో భూమి పార్టీ కార్యాలయాల కోసం స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు. గజం స్థలం రూ.100ల చొప్పున ఎకరానికి మించకుండా ఇవ్వడంతో పాటు ఆయా పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రపోలీసు శాఖకు కొత్తగా 11,577 వాహనాలు కొనుగోలు, సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు సహా సిబ్బంది నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

ఆగస్టు 15నుంచి కంటి వెలుగు
మందుపాతర పేలుడులో మృతిచెందిన మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి షేక్పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయించారు. భారత్ - పాక్ సరిహద్దులో మృతిచెందిన వీర జవాన్ ఫిరోజ్ఖాన్ కుటుంబానికి కూడా షేక్పేటలోనే 200 గజాల ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అవకాశాల పరిశీలించాలని నిర్ణయించారు. కంటి వెలుగు పథకం కింద రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షను ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications