నేను మగోడిని: ఆ మాట నిన్ను తిరిగి అంటే: ఆడపిల్లవు కాబట్టే వదిలేస్తున్నాం: షర్మిలపై జగ్గారెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళపై తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యుడు జగ్గారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆమె వ్యవహార శైలి ఏమిటో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. షర్మిల చేస్తోన్న పాదయాత్రనూ టార్గెట్ చేసుకున్నారు. షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ ముద్ర వేయడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. కోవర్ట్గా అభివర్ణిస్తూ షర్మిల చేసిన విమర్శలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని, అలా అనడం దురదృష్టకరమని అన్నారు.
కోవర్టునా? కాదా
వైఎస్ షర్మిల పాదయాత్ర ఎందుకు చేస్తోందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తోందని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. తాను కేటీఆర్కు కోవర్ట్ అంటూ నింద వేయడం దురదృష్టకరమని చెప్పారు. తాను కోవర్ట్నా? కాదా? అనేది తరువాత చెబుతానని, ఇప్పుడు షర్మిల పంచాయతీ ఏందో తేలాలని అన్నారు.
సీఎం పదవి కోసం..
తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే షర్మిల పాదయాత్ర చేస్తోన్నారని, అది సాధ్యమౌతుందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆమె అన్న ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నాడని, ఆ రాష్ట్రంలో ఎందుకు పాదయాత్ర చేపట్టట్లేదో తనకు తెలియట్లేదని జగ్గారెడ్డి అన్నారు. చుట్టరికం కొనపట్టుకుని ఊరంత తిరిగినట్టుగా షర్మిల వ్యవహారశైలి ఉందని విమర్శించారు. చుట్టరికం పేరు చెప్పుకొని బంధువుల ఇళ్లల్లో తిరిగితే ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు.
విజయమ్మకు సలహా..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని, తెలంగాణలో షర్మిలను సీఎం చేయాలంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రకటన చూశానని, ఆమెకే సలహా ఇస్తున్నానని చెప్పారు. సొంత కొడుకు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడని, అక్కడి ప్రజలు ఆయనకు పట్టం కట్టారని గుర్తు చేశారు. కొడుక్కు చెప్పి కూతురికి ముఖ్యమంత్రి చేసుకోవాలని విజయమ్మకు సలహా ఇస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో ఇప్పటికే మూడు రాజధానుల పంచాయితీ నడుస్తోందని, అదే రాజకీయం ఇక్కడ చేయొద్దని చెప్పారు.
మూడు రాజధానులు..
మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అమరావతి-కర్నూలు-విశాఖపట్నం రాజధానులుగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు అవుతారని అన్నారు. కర్నూలుకు షర్మిల, అమరావతికి జగన్, విశాఖపట్నానికి విజయసాయి రెడ్డి సీఎంలుగా పెట్టుకోవచ్చని చెప్పారు. అక్కడి రాజకీయాలను తెలంగాణ తీసుకుని రావొద్దని చెప్పారు.
మోదీకి జగన్ గులాంగిరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్ గులాంగిరి చేస్తున్నాడని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రుల పంచాయితీ మోదీ దగ్గరే తేల్చుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, తరువాత అధికారంలోకి రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసిన జీవితంలో నాయకురాలు కాలేదని తేల్చి చెప్పారు. ఏదున్నా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంటుందని జోస్యం చెప్పారు.
ఆడపిల్ల కాబట్టి..
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం కాదని షర్మిల పార్టీకి ఓటు వేయరని అన్నారు. ఆడపిల్ల అని, వైఎస్సార బిడ్డ అని కాబట్టి ఎవరూ షర్మిలను తిట్టట్లేదని జగ్గారెడ్డి చెప్పారు. మన నాయకుడి బిడ్డ అని కాంగ్రెస్ వాళ్లు జాలి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్ హవా నడిచిందని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.
ఆ మాట తిరిగి నేనంటే..
వైఎస్సార్ గుణాలు జగన్, షర్మిలకు లేనే లేవని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. డిగ్నిఫైడ్ రాజకీయాలకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనంగా ఉండేవారని, జగన్ గానీ, షర్మిల గానీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను మగాడినని, తనను షర్మిల వ్యభిచారి అని విమర్శించినా తేడా ఉండదని, అదే మాట తిరిగి అంటే అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్సార్కు తెలంగాణలో ఉన్న పేరును తీసేస్తోందని ధ్వజమెత్తారు.