పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్
గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సాయంత్రానికల్లా ఫలితాలు డిక్లేర్ చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం మూడ దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులోభాగంగా సోమవారం తొలి విడత ఎన్నికలు జరుగుతాయి.

తొలి దశ ఇలా..!
తొలి విడతలో భాగంగా సోమవారం 3,701 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 12,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 28,976 వార్డు మెంబర్ స్థానాలకు గాను 70,094 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదలావుంటే 769 సర్పంచ్ స్థానాలతో పాటు 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయితే 9 పంచాయతీలు మాత్రం కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

పనిలో పని..! ఉప సర్పంచ్ ఎన్నిక
సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాక ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఒకవేళ సోమవారం నాడు ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తికాని పక్షంలో మంగళవారం నాడు ఆ తంతు ముగిస్తారు. పంచాయతీ ఎన్నికలు సాఫీగా సవ్యంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్నీ చర్యలు తీసుకున్నారు. దాదాపు లక్ష యాబై వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అటు 26వేల మంది పోలీసులు పంచాయతీ ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయా పంచాయతీల్లో ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

నిఘా..! స్పెషల్ ఆఫీసర్స్
పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. దీనికి సంబంధించి 26 జిల్లాల్లో ఆయా శాఖల అధికారులకు ఈ బాధ్యత అప్పగించారు. సంబంధింత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీరు విధినిర్వహణలో పాల్గొంటారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ఆంక్షలు విధించే అధికారం కూడా వీరికి ఉంటుంది. గ్రామ పోరులో నగదు, మద్యం ఏరులై పారే అవకాశమున్నందున ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించారు. గట్టి నిఘా పెట్టడమే గాకుండా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications