ఉద్యోగులకు ఒకే సారి రెండు పెండింగ్ డీఏల విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల అంశాల పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్న అంశాన్ని మంత్రులు ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. అదే విధంగా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా..ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏల్లో రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్ ఆర్దిక శాఖ అధికారులను ఆదేశించారు.
డీఏల చెల్లింపు
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 4 డీఏల్లో రెండింటిని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు ఆదేశించినట్లు ఉద్యోగ సంఘాల సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ హయాంలో మూడు డీఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక డీఏ పెండింగ్ లో ఉంది. నాలుగు డీఏల్లో రెండింటిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కసరత్తు
తమ ప్రభుత్వం గతంలో కంటే భిన్నంగా ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చేవారని..తాము అధికారం లోకి వచ్చిన తరువాత ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు పైనే ఇప్పటి వరకు ఫోకస్ చేసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఉద్యోగులకు పెండింగ్ బకాయిల అంశం పైన ఆరా తీసారు. అందులో భాగంగా డీఏల చెల్లింపు పైన కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ నిర్ణయం
వచ్చ నెలలో సెప్టెంబర్ లోనే రెండు డీఏల చెల్లింపు ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. దసరా లోగా ఈ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఆర్దికంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలఖారులోగా రెండు డీఏలను విడుదల చేసేందుకు నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో, ఈ మేరకు అధికారిక ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications