హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్యలో ఐటీ: మంత్రి కేటీఆర్, డీకే శివకుమార్ ట్వీట్ చాట్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య సోమవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు నగరంలోని మౌలిక సదుపాయాలపై, ఐటీ, ఫార్మా రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు.

హైదరాబాద్ రావాలంటూ స్టార్టప్ అధినేతకు కేటీఆర్ ట్వీట్
ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ హౌసింగ్.కామ్, ఖాతాబుక్ వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ ఇటీవల ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. భారత, సిలికాన్ వ్యాలీలోని స్టార్టప్లు ఇప్పటికే బిలియన్ డాలర్ల పన్నును చెల్లిస్తున్నాయి. కానీ, ఇక్కడ మాకు చాలా చెత్త రహదారులు ఉన్నాయి. దాదాపు రోజూ కరెంట్ కోతలే. నీటి సరఫరా కూడా అంతంతమాత్రమే. ఇక పుట్పాత్లైతే మరి దారుణం. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంతకంటే మెరుగైన మౌలిక సదుపాయాలే ఉన్నాయని రవీశ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మా దగ్గర భౌతికంగా, సామాజికంగా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. మా ప్రభుత్వం ఇన్నోవేషన్, ఇన్ఫ్రాక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే మూడు ఐలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్కు స్పందించిన డీకే శివకుమార్
ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందించారు. మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరించినట్లు పేర్కొన్న డీకే శివకుమార్.. 2023 నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత బెంగళూరు ఖ్యాతిని పునరుద్ధరించి, భారతదేశంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని సవాల్ విసిరారు. మళ్లీ ఈ ట్వీట్కు కేటీఆర్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శివకుమార్ అన్న అంటూ కేటీఆర్ కౌంటర్
శివకుమార్ అన్న.. నాకు కర్ణాటక రాజకీయాల గురించి, అక్కడ ఎవరు గెలవబోతున్నారనే దాని గురించి పెద్దగా తెలియదు. కానీ, మీ సవాల్ను స్వీకరిస్తున్నా. మన దేశ ప్రజల భవిష్యత్తు, యువతరానికి ఉపాధి కల్పన కోసం హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నా. హలాల్, హిజాబ్ వంటి వాటిపై కాకుండా మౌలిక సదుపాయాలు, ఐటీ, వాణిజ్యాలపై దృష్టి పెడితే మంచిది అని కేటీఆర్ బదులిచ్చారు. కాగా, ఇటీవల హిజాబ్ వివాదం కర్ణాటకలో దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, హలాల్ వివాదం రాజుకుంది. కాగా, ఐటీ రంగానికి బెంగళూరు నగరం కేరాఫ్ అడ్రస్గా.. హైదరాబాద్ కూడా ఫార్మాతోపాటు ఐటీ రంగంలో మేటి నగరంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications