ఆర్టీసీ భవిష్యత్ నేడు తేలిపోతుందా : ప్రభుత్వం ఆలోచన సుస్పష్టం: కోర్టుపైనే కార్మికుల ఆశలు..!
తెలంగాణలో తేలని పంచాయితీగా మారిన ఆర్టీసీ సమ్మె పైన ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకావం కనిపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన డెడ్ లైన్ ను కార్మిక సంఘాలు పట్టించు కోలేదు. నామ మాత్రంగానే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో..ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు రాకుండా..అసలు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందనే ఆధారాలతో కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది.
ప్రభుత్వం వేసిన ఈ రివర్స్ గేర్ తో అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టమవుతోంది. ఇక, ఇదే సమయంలో కార్మికలు మాత్రం కోర్టు సూచన చేస్తే ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందనే ఆశతో ఉన్నారు. ముఖ్యమంత్రి అనుకున్నా.. ఏకంగా 48 వేల మంది ఉద్యోగులకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోలేరనేది కార్మిక సంఘాల ఆలోచన. దీంతో..గురువారం అటు ప్రభుత్వం..ఇటు హైకోర్టు లో జరిగే పరిణామాల ఆధారంగా సమ్మె..ఆర్టీసీ భవిష్యత్తు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం రివర్స్ గేర్..
ఆర్టీసీ సమ్మె విషయంలో మొదటి నుండి పట్టు వీడకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కీలక అడుగులు వేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి సూచన చేసినా..డెడ్ లైన్ విధించినా పరిగణలోకి తీసుకోకపోవ టాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరగణిస్తోంది. దీంతో..ముఖ్యమంత్రి ఆర్టీసీ..ఆర్డిక..రవాణా అధికారులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
కోర్టులో దాఖలు చేయాల్సిన అఫిడవిట్లు ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా కోర్టు విచారణ..తీసుకొనే నిర్ణయం తరువాత ప్రభుత్వం తమ విధానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా ముందుగా న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అఫిడవిల్లు దాఖలు చేసింది. అందులో గతంలో జరిగిన వాదనలకు సమాధానంగా ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడలేదని..ఆర్టీసీనే ప్రభుత్వానికి బకాయి పడిందని అంకెలతో సహా వివిరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసారు.మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీ రూ.453 కోట్లు బకాయి పడిందని..దీనిని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. దీని ద్వారా మొత్తంగా ప్రభుత్వం నుండి ఆర్టీసీకి ఇక ఇచ్చేదీ ఏమీ లేదని చెప్పటం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.
కోర్టు ముందుకు అధికారులు..
గురువారం కోర్టులో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా ఉన్నతాధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్లను కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. నలుగురు ఉన్నతాధికారులూ ఉన్నత న్యాయస్థానం ముందు అఫిడవిట్లతో సహా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష లో కోర్టులో ఏం చెప్పాలనే దాని పైన లోతుగా అధ్యయనం చేసారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సుమారు 3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా 3,903 కోట్లు చెల్లించిందని అధికారులు అఫిడవిట్ రూపంలో కోర్టుకు నివేదించారు. విచారణ సమయంలోనూ మరోసారి స్పష్టం చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిందీ ఇచ్చేసినట్లే లెక్కగా ప్రభుత్వం వాదిస్తోంది. హైకోర్టులో విచారణ పూర్తయిన తరువాత ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇక, కోర్టులో జరిగే వాదనలు..కోర్టు నిర్ణయం ద్వారా మొత్తంగా ఆర్టీసీ వ్యవహారం మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కార్మికులు ఆశలన్నీ కోర్టు వైపే..
ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించినా కార్మిక సంఘాలు మాత్రం వెనుకడుగు వేయలేదు. అర్టీసీకి ప్రభుత్వం బకాయి లేదని..ఇస్తాననన్న సొమ్ములో పైసా కూడా ఇవ్వాల్సింది లేదని ప్రభుత్వం తేల్చేసింది. దీని పైన కోర్టులో వాదనలు సాగనున్నాయి. కార్మిక సంఘాలు మత్రం కోర్టు వైపు ఆశగా చూస్తున్నాయి. హైకోర్టులో జరుగుతున్న వాదనల ఆధారంగా కోర్టు స్పందిస్తున్న తీరు తమకు అనుకూలంగా ఉందని ముందు నుంచి కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
డిమాండ్ల పరిష్కారానికి వీలుగా చర్చల విషయంలోనూ గురువారం కోర్టు ప్రభు త్వానికి సూచన చేస్తుం దన్న ఆశాభావంతో ఉన్నట్టు చెబుతు న్నారు. సీఎం డెడ్లైన్తో కార్మికులు విధుల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచినా న్యాయపోరాటంలో గెలుస్తామని సంఘాలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాయి. దీంతో సమ్మెలో కొనసాగేందుకే కార్మిక లోకం మొగ్గుచూపింది. మొత్తంగా అటు కోర్టులో..ఇటు ప్రభుత్వంలో చోటు చేసుకునే పరిణామాలు ఆర్టీసీ భవిష్యత్ ను తేల్చనున్నాయి.