6 శాతమా?: ఏప్రిల్ 17 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ( జేఏసీ) నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వాలని బుధవారం ఇంజినీర్స్ భవన్లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు.
విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ ఒప్పందం(పీఆర్సీ)పై బుధవారం మధ్యాహ్నం అన్ని సంఘాల నేతలతో విద్యుత్ సంస్థల ఎంసీడీలు దేవులపల్లి ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి చర్చలు జరిపారు. విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున వేతనాలను 6 శాతం మాత్రమే పెంచగలమని సీఎండీలు ఉద్యోగులకు స్పష్టం చేశారు.

వేతన సవరణపై నియమించిన కమిటీ 5 శాతం పెంపును మాత్రమే సిఫార్సు చేసినట్లు తెలిపారు. అయితే, తాము ఇంతకుముందు కోరినట్లుగా 30 శాతం పెంచాల్సిందేనని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 6 శాతానికి మించి పెంచలేమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే విద్యుత్ సంఘాల నేతలు సమావేశమయ్యారు.
సమ్మె నోటీసును సీఎండీలకు అందజేస్తామని జేఏసీ ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు, నేతలు శ్రీధర్, బీసీరెడ్డి, సదానందం తదితరులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందని, ఏడాదిపాటు ఓపిక పట్టామని.. ఇక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 17 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే మార్చి 24న విద్యుత్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications