సర్వర్లో సాంకేతిక సమస్యతో ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష: అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్లైన్ పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్లో సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఇంగ్లీష్ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు, పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించడం లేదు.
సర్వర్లో సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పరిస్థితి ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్ష ప్రారంభం కాకపోవడంతో హయత్నగర్లోని పరీక్షా కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు అభ్యర్థులతో మాట్లాడి.. వారిని శాంతింపజేశారు. ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అయితే ఇప్పటికే పరీక్ష ఆలస్యమైందని.. ఇదేరోజు 12 గంటల 30 నిమిషాలకు, 4 గంటల 30 నిమిషాలకు ఆన్లైన్ పరీక్షలు ఉన్నాయని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 గంటల తర్వాత అనుమతి
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పీజీటీ గురుకుల పరీక్ష జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పరీక్షా కేంద్రంలోకి 10.16 గంటలకు అభ్యర్థులను అనుమతించారు. దీంతో చాలా ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications