తెలంగాణలో మూడు రోజులు జోరు వానలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఆదివారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
సోమవారం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక, శుక్రవారం నాడు కూడా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొత్తపేట్, సరూర్ నగర్లో, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేటలో కూడా అక్కడక్కడ వాన జల్లులు పడుతున్నాయి. మలక్పేట్, చాదర్ఘూట్, ఎల్బీనగర్లోను జోరువాన కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications