వీడియో: కదిలిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి: నిమజ్జనం ప్లేస్ ఇదే..
Ganesh Nimajjanam: హైదరాబాద్లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఖైరతాబాద్లో కొలువుదీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతి ఇచ్చి.. శోభాయాత్రను ప్రారంభించారు.

మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య మహాగణపతి నిమజ్జనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 వద్ద ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇదివరకే పూర్తయ్యాయి.
నిమజ్జనం రోజు కావడంతో తెల్లవారు జాము నుంచే తండోపతండాలుగా ఖైరతాబాద్కు చేరుకున్నారు భక్తులు. భక్తిశ్రద్ధలతో మహాగణపతికి పూజలు చేశారు. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారింది.
నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుగ్గా సాగుతోంది. రోడ్లన్నీ శోభాయాత్రతో సందడిగా మారాయి. జంటనగరాలన్నీ కాషాయమయం అయ్యాయి. వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు, లారీలు, ట్రాక్టర్లతో నిండిపోయాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
— Telugu Galaxy (@Telugu_Galaxy) September 17, 2024
మధ్యాహ్నం 2 గంటల వరకు NTR మార్గ్ క్రేన్ నంబర్-4 దగ్గరికి చేరుకోనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు#KhairatabadGanesh #Hyderabad #Telangana pic.twitter.com/4fLgRfxvHC
నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు చేరుకుంటోన్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ను అధికారులు మూసివేయనున్నారు. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జోనల్ కమిషనర్లు, నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది ముందుగానే పూర్తి చేశారు.
నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పండగ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ముగిసేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.












Click it and Unblock the Notifications