అసెంబ్లీ సాక్షిగా ఉపఎన్నికలపై తేల్చేసిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఉపఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఉపఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. తెలంగాణలో ఇప్పట్లో ఉపఎన్నికల్లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ సభ్యులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానమిచ్చారు. ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.

ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చినా.. మళ్లీ వెనక్కి వెళ్లినా.. వాటితో సంబంధం లేకుండా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి తన ప్రాధాన్యత అని చెప్పారు. ఉపఎన్నికల గురించి చర్చించేందుకు తన సమయం వృథా చేసుకోవడం లేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున.. తీర్పు వచ్చిన తర్వాత తాము దాన్ని స్వీకరిస్తామన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గత ప్రభుత్వం పాటించిన సంప్రదాయాన్నే తాము కూడా పాటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, ఆ పార్టీ అడుగుజాడల్లో నడవమని చెప్పారు. అలా చేస్తే ప్రజలు తమను కూడా ఇంటికి పంపిస్తారన్నారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆ వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లింది. త్వరలో దీనిపై కోర్టు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. దీంతో వీరంతా రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఊపిరిపీల్చుకున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కూడా ఎలాంటి ఉపఎన్నికలు జరగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత సంప్రదాయాన్నే తాము కూడా కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications