ప్రశ్నిస్తే జైల్లో పెడతారా: కేసీఆర్కు నేనేంటో చూపిస్తా...బెయిల్పై విడుదలైన జగ్గారెడ్డి
తనపై కేసీఆర్ రాజకీయంగా కక్షసాధిస్తున్నారని ధ్వజమెత్తారు సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మనుషుల అక్రమరవాణా కేసులో అరెస్టై బెయిల్ పై జగ్గారెడ్డి సోమవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే తాను చేసిన నేరమని జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం నాటి కేసును కేసీఆర్ తిరగదోడారని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతోంది కనుకనే తనను కేసీఆర్ కుటుంబం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పైందని జగ్గారెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని... లేకుంటే పాత కేసులను తిరగదోడుతున్నారని ఫైర్ అయ్యారు.
జగ్గారెడ్డి పై ముమ్మాటికి కక్ష్యసాధింపే
ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్కు ఇకపై తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. ఎన్నికలకు నెలరోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేదా నియంత పాలనైన కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుని తీర్పు ఇవ్వాలన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయాలేదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా గుర్తులేని కేసులు కేవలం ఎన్నికలకు నెలరోజుల ముందే గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న జగ్గారెడ్డి తను నిర్దోషిగా బయటపడతానన్నారు.
2004లో జగ్గారెడ్డి బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్పోర్టులు, వీసాలు సంపాదించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి.ఈ అంశంలోనే నకిలీ పాస్ పోర్టులు సృష్టించి చట్టాలను ఉల్లంఘించాడని జగ్గారెడ్డి పై అభియోగాలు మోపారు.