Tollywood Drugs Case:మళ్లీ డ్రగ్స్ కేసు ప్రకంపనలు-పూరి,రవితేజ సహా 12 మందికి ఈడీ నోటీసులు-ఆ తేదీల్లో విచారణ
నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెర పైకి వచ్చింది. కొన్ని నెలలుగా మరుగునపడ్డ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు,ఇద్దరు బయటి వ్యక్తులు ఉన్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈడీ నోటీసుల ప్రకారం... ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్, సెప్టెంబరు 2న నటి ఛార్మి, 6న హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్, 8న హీరో రానా దగ్గుపాటి, 9న హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నటుడు నవదీప్, ఫిల్మ్నగర్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న నటి ముమైత్ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.డ్రగ్స్ కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంపై ప్రశ్నించేందుకు ఈడీ వీరిని విచారించనుంది.విదేశాల నుంచి మత్తుమందులు కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆబ్కారీశాఖ దర్యాప్తులో వెల్లడి కాగా... సిట్ దీనిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. దీంతో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
2017లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు :
హైదరాబాద్లో 2017,జులైలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగుచూసింది. నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేస్తున్న సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన కెల్విన్ (29), చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్నగర్కు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్ వహాబ్(20), ఎండీ అబ్దుల్ ఖుద్దూస్ (20)లను ఆబ్కారీ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులు,ఇంజనీరింగ్ విద్యార్థులు,సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ టీమ్ 10 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చి వారిని విచారించింది. హీరో రవితేజ కారు డ్రైవరుతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి సహా చాలా మందిని విచారించారు.
మొత్తం 12 కేసులు 11 చార్జిషీట్లు...
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తం 12 కేసులు నమోదు చేశారు. 30 మందికి పైగా అరెస్ట్ చేశారు. 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ఇప్పటివరకూ 11 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. అయితే వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వ్యక్తులను నిందితులుగా చేర్చలేదు.అప్పట్లో దాదాపు 62 మంది అనుమానితుల జట్టు,గోళ్ల శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారణకు పంపించారు. డ్రగ్స్ తీసుకునేవారిలో జుట్టు,గోళ్లలో చాలాకాలం పాటు ఆ ఆనవాళ్లు ఉంటాయని... వాటిని నిర్దారించేందుకే ల్యాబ్కు పంపించామని అధికారులు వెల్లడించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో ఏం తేలిందనేది బయటకు రాలేదు. ఈ కేసులో పెద్ద తలకాయలను తప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి.డ్రగ్స్ కేసులో మీడియా తీరుపై అప్పట్లో పూరి జగన్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.మీడియా అంటే తనకు ఇష్టమంటూనే తన జీవితాన్ని సర్వనాశనం చేసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నడ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ కేసు కలకలం
కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో సంజన గల్రానీ,రాగిణి ద్వివేదిలను పోలీసులు అరెస్ట్ చేశారు.గతేడాది సెప్టెంబర్లో నటి సంజన గల్రానీ నివాసంపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పోలీసు విభాగం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన తరువాత, డ్రగ్స్ కేసుకు సంబంధించి సిసిబి ఆమె ఇంటిపై దాడి చేసింది. అనంతరం ఆమెను సిసిబి విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు,రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు
కన్నడ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయినవారిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన హెయిర్ శాంపిల్స్ను పరీక్షించడం ద్వారా దీన్ని నిర్దారించారు.'ఈ కేసును వేగవంతంగా,పారదర్శకంగా విచారించామని నేను గర్వంగా చెప్పగలను. ఇప్పుడీ కేసులో కీలక పురోగతి లభించింది.' అని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో కొంతమంది నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు.
ఇప్పటివరకూ ఎవరెవరిని అరెస్ట్ చేశారంటే..
కన్నడ డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన నిందితుల హెయిర్ శాంపిల్స్ను మొదట అక్కడి అధికారులు తిరస్కరించారు. సాధారణంగా రక్తం,మూత్రంలో డ్రగ్స్ ఆనవాళ్లు 24 గంటల నుంచి 48 గంటల వరకు ఉంటాయి. అయితే అంత తక్కువ వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేయడం,శాంపిల్స్ సేకరించడం చాలా సందర్భాల్లో సాధ్యపడదు. అయితే హెయిర్ శాంపిల్స్లో మాత్రం ఏడాది వరకు ఆ ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్కి హెయిర్ శాంపిల్స్ను పంపించామన్నారు. ల్యాబ్ నిర్వాహకులు మొదట ఆ శాంపిల్స్ను తిరస్కరించగా... మరోసారి పంపించామన్నారు.
కేసు విచారణ సందర్భంగా... దర్యాప్తు విషయాలను లీక్ చేస్తున్న అధికారులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకూ సంజన గల్రానీ,రాగిణి ద్వివేది,పార్టీ ఆర్గనైజర్ వీరేన్ ఖన్నా,దివంగత మాజీ మంత్రి జీవరాజ్ తనయుడు ఆదిత్యా అల్వాలను అరెస్ట్ చేశారు. అలాగే కన్నడ సినీ నటులకు డ్రగ్స్ సప్లై చేస్తున్న మహమ్మద్ అనూప్,రీజేష్ రవీంద్రన్,అనీఖా దినేశ్లను అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఏం జరుగుతుందనేది ఇప్పుడే తానేమీ చెప్పలేనని... ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేల్చిందన్నారు పోలీసులు. ఇప్పుడు తమకు నమ్మకం కుదిరిందని... కేసులో అన్ని ఆధారాలు రాబడుతామని చెప్పారు.
Recommended Video