ముత్యాలధార జలపాతం వద్ద పర్యాటకులు సేఫ్.. 82మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సుందరమైన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో కొందరు పర్యాటకులు ములుగు జిల్లాలోని అందాల జలపాతం ముత్యాల ధార వద్దకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు.
ముత్యాలధార జలపాతం వద్ద పర్యాటకులు సేఫ్.. 82మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..!! pic.twitter.com/ylHvzISJ8M
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
ఇటీవల కాలంలో ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ముత్యాల ధార జలపాతం సందర్శనార్థం వెళ్లిన 82 మంది పర్యాటకులు తిరిగి రాలేక అక్కడ అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తుండగా అడవిలో చిక్కుకున్న వారిని రక్షిస్తామని చెప్పిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలంములుగు జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలచే ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేయించి తిరిగి వారిని కాపాడారు.

ముత్యాల ధార జలపాతం వీక్షించడానికి వెళ్లిన సందర్శకులు దారితప్పి అడవిలో చిక్కుకున్న విషయం జిల్లా ఎస్ పి గౌష్ ఆలం దృష్టికి రాగానే, ఆయన దారితప్పి అడవిలో చిక్కుకుపోయిన సందర్శకులతో ఫోన్ లో మాట్లాడారు. చిక్కుకుపోయిన పర్యాటకులు తాము తిరిగి బయటకు రావాలంటే ఒక వాగు అడ్డంగా ఉందని, వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పారు.
దీంతో వాగు దాటేందుకు ఎట్టిపరిస్తుతులలో ప్రయత్నించవద్దని, రెస్క్యూ బృందాలు హుటాహుటిన తమ వద్దకు చేరుకుంటారని అప్పటివరకు వారు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని మరియు కమ్యూనికేషన్ కొరకు వారి మొబైల్ బ్యాటరీ భద్రపరచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందవద్దని మనోధైర్యంతో ఉండాలని ఆహార పదార్థాలు ఇతర రెస్క్యూ పరికరాలు తమ వద్దకు పంపించబడుతున్నాయని అప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ఉండాలని కోరారు.

ఇదే సమయంలో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన సంఘటన స్థలానికి పంపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన బృందాలు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ముత్యాల ధార జలపాతం చూసేందుకు వెళ్లి అడవిలో చిక్కుకున్న 82 మంది పర్యాటకులను వారు రక్షించారు. దీంతో ఆయా పర్యాటకుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరూ ఇటువంటి సాహసాలు చేయొద్దని జిల్లా ఎస్పీ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications