రేవంత్ కు తేల్చి చెప్పిన హైకమాండ్ - కీలక నిర్ణయం దిశగా..!!
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్ లో కదలిక మొదలైంది. సిట్టింగ్ సీటు పోగొట్టుకోవటంతో పాటుగా డిపాజిట్ రాకపోవటంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీసింది. పార్టీ నూతన అధ్యక్షుడుకి ఇప్పటికే ఈ ఫలితం పైన టీపీసీసీ నివేదిక ఇచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపడితే, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిలో అనూహ్య మార్పు వస్తుందని అధినాయకత్వం ఆశించింది. కానీ, వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీకి తగ్గుతున్న ఓటింగ్ శాతం తో ఇప్పుడు టీపీసీసీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

మునుగోడు ఫలితంతో డైలమా
రాహుల్ జోడో యాత్ర వరకు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ చేయగలిగారు. కానీ, అదే సమయంలో జరిగిన మనుగోడు ఫలితం పైన సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మరో 10 నెలల్లో మూడో సారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రేవంత్ కలిసిన సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన క్లియర్ గా రూట్ మ్యాప్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. గ్రూపులు - వ్యక్తులు - వివాదాలు పక్కన పెట్టి.. టీపీసీసీ చీఫ్ గా పార్టీలో జోష్ పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ తేల్చి చెప్పింది. అందులో భాగంగా..తెలంగాణలో షర్మిల.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రల విషయం పైన చర్చకు వచ్చినట్లుగా సమాచారం.

కాంగ్రెస్ ఓటింగ్ శాతంపై ఆందోళన
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ మారుతున్న సమయంలో.. పార్టీ కేడర్ లో జోష్ నింపేలా కార్యచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. ఎన్నికలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉండటంతో, అటు కేడర్ లో జోష్ పెంచటం తో పాటుగా.. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, బస్సు యాత్రకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, పాదయాత్ర చేయటం ద్వారానే... నేరుగా ప్రజలు - పార్టీ కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు వెసులుబాటు కలుగుతుందనేది మరో వాదన.

ప్రజల్లోకి ఇక రేవంత్ వెళ్లేలా వ్యూహం
కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కొనుగోలు ఇప్పటికే రేవంత్ ప్రజల్లోకి వెళ్లే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ఆదరణ ఉందని, దానిని ఓట్లుగా మలచుకోవాలంటే పార్టీ కార్యకర్తల్లో..సానుభూతి పరుల్లో నాయకత్వం పైన నమ్మకం కలిగించాలని పార్టీ అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో, జవనరి లో తెలంగాణ వ్యాప్తంగా పర్యటన ఉండేలా రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ ప్రణాళిక ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇవ్వాలని రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. త్వరలో నే తెలంగాణకు కొత్త పార్టీ ఇంఛార్జ్ నియామకం జరగనుంది.












Click it and Unblock the Notifications