మెదక్ జిల్లాలో కుప్పకూలిన శిక్షణా విమానం.. ఇద్దరు మృతి!!
మెదక్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ శివారులో గల టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. తూప్రాన్ పట్టణం పరిధిలోని రావెల్లి శివారులో జరిగిన ఈ ఘటనలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఉదయం మెదక్ వాయుసేన కేంద్రం నుంచి పిలాటియస్ పీసీ 7 ఎంకే శ్రేణికి చెందిన శిక్షణ విమానం బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ట్రెయినింగ్ సమయంలో ప్రమాదానికి గురై కుప్పకూలింది. దాంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఒకసారిగా భారీ మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సజీవ దహనం అయినట్టు గా తెలుస్తుంది. కనీసం మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనంతగా వారు అగ్నికి ఆహుతి అయ్యారు.

ఈ శిక్షణ విమానంలో ఇద్దరు ప్రయాణిస్తుండగా ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్ అని తెలుస్తుంది. సాంకేతిక కారణాల వల్లే విమానం కుప్పకూలినట్టుగా అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే దుండిగల్ ఎయిర్పోర్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మృతుల్లో ఒకరు అభిమన్యు రాయ్ గా గుర్తించారు . మరొకరు వియత్నాం కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఇక ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయనున్నారు.












Click it and Unblock the Notifications