రేవంత్ది మంకీ మైండ్.. ఫాదర్ ఆఫ్ ది ఐరన్ లెగ్.. దమ్ముంటే హుజురాబాద్లో పోటీ చెయ్... జీవన్ రెడ్డి సవాల్...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సివాల్ విసిరారు. రేవంత్ బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలే నాలుక కోస్తారని హెచ్చరించారు. రేవంత్ కేసీఆర్ కాలి గోటికి సరిపోడని వ్యాఖ్యానించారు. రేవంత్ తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

రేవంత్ది మంకీ మైండ్ : జీవన్ రెడ్డి
'గోడల మీద పెయింటింగ్స్ వేసిన నీకు జూబ్లీహిల్స్లో ఇల్లు,ఇన్ని ఆస్తులు ఎక్కడివో చెప్పు. ఉద్యమ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయక గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి... 37 జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్. మాట్లాడితే రేవంత్కు జైలే గుర్తుకొస్తుంది. గతంలో రెండుసార్లు చిప్పకూడు తిన్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి.అందుకే రేవంత్ది కోతి దిమాఖ్.. మంకీ మైండ్... కేసీఆర్ది మాంక్ మైండ్... కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలతో ప్రతీ ఇంట్లో ఆనందం,సంతోషం కనిపిస్తోంది. తెలంగాణకు ఇంకా 20 సంవత్సరాలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ ప్రకటించారు... తీసుకున్నారా సన్యాసం.' అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

అలీబాబా అరడజను దొంగల్లా...: జీవన్ రెడ్డి
రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అలీబాబా అరడజను దొంగలు తరహాలో ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గతంలో ఓ టూరిస్ట్ ఎంపీలా పనిచేశాడని.. ఆయన కూడా కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రిని పట్టుకుని అనుచిత పదజాలంతో మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలకు ప్రజలే జవాబు చెబుతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఫాదర్ ఆఫ్ ది ఐరన్ లెగ్ అని.. ఆయన ఏ పార్టీకి పోతే అది నాశనమవడం ఖాయమని అన్నారు. సోనియమ్మను ఆనాడు తెలంగాణ దెయ్యమని విమర్శించిన రేవంత్... ఇవాళ దేవత అంటున్నాడని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కూడా నీలాగే ప్రతీకారంతో వ్యవహరిస్తే ఐదు నిమిషాల్లో నిన్ను జైల్లో పెట్టించగలరని హెచ్చరించారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పైకి లేవట్లేదని... అందుకే రేవంత్ అందరినీ తిడుతున్నాడని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అంటే ఫాదర్ ఆఫ్ ది కరప్షన్... : జీవన్ రెడ్డి
కేసీఆర్ జైలుకు పంపిస్తేనన్నా తనకు సానుభూతి వస్తుందని రేవంత్ భావిస్తున్నాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ అని... ఆ పదం పుట్టిందే కాంగ్రెస్ నుంచి అని విమర్శించారు.బొగ్గు కుంభకోణం,కార్ల కుంభకోణం,అగస్టా కుంభకోణం,2జీ కుంభకోణం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని గుర్తుచేశారు. అలాంటిది కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ కీలక నేతల్లో 20,30 మంది నేతలు బెయిల్పై బయటకొచ్చినవారేనని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు స్టువర్ట్పురం దొంగలను మించిపోయారని విమర్శించారు. కేసీఆర్ను జైల్లో పెట్టిస్తామనడాన్ని జీవన్ రెడ్డి ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నందుకు ఆయన్ను జైల్లో పెడుతారా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినందుకు జైల్లో పెడుతారా అని నిలదీశారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికలు తీయించి భూగర్భ జల మట్టం పెరిగేలా చేసినందుకు జైల్లో పెడుతారా అని ప్రశ్నించారు.

గాంధీభవన్లే కాంగ్రెస్ నేతలే రేవంత్ను బొందపెడుతారు... : జీవన్ రెడ్డి
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులే గాంధీభవన్లో బొంద పెడుతారని జీవన్ రెడ్డి విమర్శించారు.నిన్న గాక మొన్న బండి సంజయ్ ప్రగతి భవన్ను లక్ష నాగళ్లతో దున్నుతానని అన్నాడని... ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని కూలదోయడమేంటని ప్రశ్నించారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగనట్లుగా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్తో పెట్టుకున్నోళ్లు ఎవరూ మిగల్లేదని.. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని అత్యధిక కాలం దోచుకున్నది కాంగ్రెస్,బీజేపీలేనని అని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కాళేశ్వరం ఎందుకు కట్టలేదు... దళిత బంధు లాంటి పథకాలు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. దళిత బంధుకు కాంగ్రెస్ వ్యతిరేకమా అని ప్రశ్నించారు.

దమ్ముంటే హుజురాబాద్లో పోటీ చెయ్ : జీవన్ రెడ్డి
రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చెయాలని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ అంటే కటింగ్,ఫిటింగ్,కలెక్షన్ అని ఎద్దేవా చేశారు. ఎన్ని సభలు పెడితే అంత కలెక్షన్లు అని... అందుకే రేవంత్ సభలు పెడుతున్నాడని విమర్శించారు. ఇంటలిజెన్స్ ఐజీపై మాట్లాడటం,అధికారులను బెదిరించడం సరికాదన్నారు. ఒకప్పుడు రేవంత్ పెయింటర్ రెడ్డి అని,ఇప్పుడు బ్లాక్మెయిలర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇకనైనా విధానాలు మార్చుకోకపోతే ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటారని విమర్శించారు. డి.శ్రీనివాస్ కూడా గతంలో రెండుసార్లు పీసీసీగా చేసి.. చివరకు టీఆర్ఎస్లోకి వచ్చి పదవి తీసుకున్నాడని అన్నారు. రేవంత్ ఇకనైనా డ్రామాలు బంద్ చేయాలని హెచ్చరించారు. కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ అని.. రేపు సాయంత్రం వరకు వంద మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను చెప్పగలరా అని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications