కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం.. ధాన్యం కొనుగోలు చేసేవరకు వదిలేది లేదు : టీఆర్ఎస్ నిరసనలు
వడ్ల కొనుగోలుపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ నిరసనలకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. వడ్లను కొనను అంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉసురు తగలక తప్పదని హెచ్చరించింది. ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తన దుర్మార్గపు రాజకీయలకు తెలంగాణ రైతాంగాన్ని ముంచేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని దుయ్యబట్టింది. తక్షణమే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.
అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ
దేశంలో అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శిచారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మూసాపేటలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనడం లేదని తాము అధికారంలోకి వస్తే రైతాంగం పండించిన ప్రతి పంట కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా తమ పార్టీ మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు చూపిస్తే ఆయన నోటి నుంచి మాట కూడా రాలేదన్నారు. కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తాం..
దాన్యం కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని వదిలేది లేదని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. మెడలు వంచైనా వడ్లను కొనిపిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని బూర్గంపహాడ్ లో టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలో విప్ రేగా కాంతారావుతో కలిసి అజయ్ కుమార్ మంత్రి పాల్గొన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపణలు గుప్పించారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి అజయ్ కుమార్ నిలదీశారు. దేశ వ్యాప్తంగా తిరిగి బీజేపీ బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
3కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనిపిస్తాం..
కేంద్రంలోని మోదీ మెడలు వంచైనా తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనిపిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యపేటలో టీఆర్ఎస్ నిర్వహించిన నిరసనలో మంత్రి పాల్గొన్నారు. దుష్ట రాజకీయాలకు కేరాఫ్గా బీజేపీ మారిందని దుయ్యబట్టారు. దేశంలో రైతలు పండించిన వరి, గోధుమలను ఆహార భద్రత చట్టం కింద కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బీజేపీ నేతలు ఇప్పుడు కన్పించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేంద్రం చేత కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. కేంద్ర వైఖరి తెలిసే ముఖ్యమంత్రి కేసీఆర్ వరి సాగు చేయొద్దని రైతులకు సూచించారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications