అన్నింటా మోసం, సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చారు: కేసీఆర్పై డీకే అరుణ
హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆ తర్వాత తన కొడుకు, అల్లుడు, కూతురుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తోందని టిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. నల్గొండలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సంస్మరణ సభ నేపథ్యంలో వారు విమర్శలు గుప్పించారు. దీనికి డీకే అరుణ ధీటుగా స్పందించారు.
తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారని, అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు కానీ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెట్టుకుందని, కానీ కవిత, కేటీఆర్, హరీష్ రావులకు మాత్రమే వచ్చాయన్నారు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారన్నారు. సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చింది టీఆరెస్సే అన్నారు.
టీఆర్ఎస్ మహిళా సంఘాలను పట్టించుకోవడం లేదని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. మహిళల అభివద్ధికి తాము కృషి చేశామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలకు రుణాలు ఇచ్చామని, ఇందిరమ్మ పేరు మీద అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. ప్రతి మహిళకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చామన్నారు.