హృదయవిదారకం: ఆడుకుంటూ వెళ్లిన కవలలు, రైలు ఢీకొని మృతి
కామారెడ్డి: జిల్లాలోని నర్సన్నపల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేుకుంది. ఆడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లిన మూడేళ్ల కవలలను రైలు ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. నర్సన్నపల్లికి చెందిన చంద్రం, భాను దంపతులకు మూడేళ్ల క్రితం కవలలు విద్వేష్, విఘ్నేశ్ జన్మించారు.
సోమవారం తండ్రి పని మీద బయటికి వెళ్లగా.. పిల్లలు తల్లి వద్దనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పిల్లలిద్దరూ ఇంటి ముందే ఆడుకుంటుండడంతో.. తల్లి ఇంటి పనిలో నిమగ్నమైంది.
కాగా, ఆడుకుంటూ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లిన చిన్నారులను మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ ఢీకొంది. శరీర భాగాలు చెల్లాచెదురై.. ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
కాగా, ఈ కవలలు ఒకే రూపురేఖలు ఉండటంతో స్థానికులు కూడా ఎంతో ఇష్టంగా వారిని తరచూ ఆడిస్తూ ఉండేవారు. అలాంటి వారు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు స్థానికులు కూడా కన్నీటిపర్యాంతమయ్యారు. కవలల మృతితో వారి కన్నతల్లి రోదనలు మిన్నంటాయి. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కవలల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.