చిక్కారు: ఫ్లిప్కార్ట్, అమెజాన్ల సైట్ ఆర్డర్లలో రాళ్లు, ఇటుకలు నింపేది వీరే
హైదరాబాద్: ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వినియోగదారులకు వస్తువులకు బదులు రాళ్లు, ఇటుకలు రావడం వంటి నేరాలను మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఈ క్రమంలో ఈ కామర్స్ వెబ్ సైట్స్ అయిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సోదరులను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇషాకీ, మహ్మద్ షర్ఫరోజ్ అన్సారీ వరుసకు సోదరులు. కుటుంబంతో నగరానికి వలస వచ్చిన వీరు గోల్కొండ ఠాణా పరిధిలోని ధన్కోట ప్రాంతంలో నివసిస్తోంది. ఇషాకీ జూబ్లీహిల్స్లోని ఇగ్నోలో సైకాలజీ చదువుతుండగా.. అన్సారీ జవహర్నగర్లోని కళాశాలలో బీబీఏ అభ్యసిస్తున్నాడు.
Also Read: వినూత్నం: ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి ఐఐటీ విద్యార్ధి
ఇషాకీ అమేజాన్ సైట్లో పుస్తకాల విక్రేతగా రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ఆర్డర్స్పై కొన్ని పుస్తకాలను విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఈ కామర్స్ సంస్థలు వస్తువుల్ని ప్యాక్ చేసే విధానం, చెల్లింపులపై పూర్తి అవగాహన ఉండటంతో అన్సారీతో కలసి ఆన్లైన్ వెబ్ సైట్స్ను మోసం చేయాలనే ఆలోచన వచ్చింది.
ఫ్లిప్కార్ట్, అమెజాన్ వెబ్సైట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, కెమెరాలు, డీవీడీ ప్లేయర్లను ఆర్డర్ చేసేవారు. ఆయా వస్తువుల్ని తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్ను గోల్కొండలోని తన ఇంటి వద్దే కలిసేవారు. వారి నుంచి పార్శిల్ను తీసుకునే ఇషాకీ.. నగదు చెల్లించేందుకు డెబిట్ కార్డ్ తీసుకువస్తానంటూ లోపలికి వెళ్లేవాడు.
డెలివరీ బాయ్కు అనుమానం రాకుండా అన్సారీ అక్కడే ఉండి అతడితో మాట్లాడేవాడు. ఇంట్లోకి వెళ్లిన ఇషాకీ.. చాకచక్యంగా పార్శిల్ను తెరిచి అందులోని వస్తువు తీసి, ఆ వస్తువుకు సమానంగా బరువు ఉండే ఇసుకను ప్యాక్ చేసి బాక్సులో ఉంచేవాడు. అనంతరం సీలింగ్ మిషన్ సాయంతో సీలు వేసేవాడు.
అలా ఇంట్లో ప్యాక్ చేసిన 'విలువైన వస్తువు'లతో పాటు బ్యాలెన్స్ లేని డెబిట్ కార్డును తీసుకుని బయటకు వచ్చేవాడు. కార్డును డెలివరీ బాయ్కు ఇచ్చేవాడు. స్వైపింగ్ మిషన్లో స్వైప్ చేసిన డెలివరీ బాయ్స్ అందులో బ్యాలెన్స్ లేదని చెప్పేవారు. దీంతో 'సారీ' చెప్పేసి.. అన్సారీ పార్శిల్ను తిరిగి వారికి అప్పగించేసేవాడు.
Also Read: ఆన్లైన్లో మొబైల్ కోసం ఆర్డర్ చేస్తే 2 మామిడి పళ్లు వచ్చాయి
ఇలా ప్లిప్ కార్ట్ను ఎనిమిది సార్లు మోసం చేశారు. ప్లిప్కార్ట్ ను మోసం చేసి కాజేసిన మూడు ఖరీదైన సెల్ఫోన్లు, ఓ కెమెరా, ల్యాప్టాప్, డీవీడీ ప్లేయర్ను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్నీ చోరీ చేసినట్లు తెలియడంతో దానిని కూడా రికవరీ చేశారు.
తాము అమేజాన్నూ ఇదే తరహాలో మోసం చేశామని నిందితులు వెల్లడించారు. నిందితులను గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ సంస్థ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.