సీఎం దోపిడీ ఇంకెంత కాలం: సాద్వీ, కేసీఆర్కు బండి సంజయ్ సవాల్, రాజా సింగ్ కలకలం
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం కేసీఆర్కు తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ అంబేద్కర్ ను గౌరవిస్తున్నామంటూ దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీ ఛార్జ్ చేయించిన పార్టీ టీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు.
అంబేద్కర్కు ఇచ్చిన గౌరవం అంటూ బండి సంజయ్
టీఆర్ఎస్ నేతలు ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా బీజేపీనే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ తెలుసుకోవాలని ఈ సభ ముఖంగా తెలిపారు. కొత్త సచివాలయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళిత సమాజం కేసీఆర్ను విశ్వసిస్తోందన్నారు బండి సంజయ్. 'దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టింది బీజేపీ. అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చింది బీజేపీ. అంబేడ్కర్ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా పంచ తీర్ధాలను ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
ఒవైసీకి ఎప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలే కనబడుతున్నారు. మజ్లిస్ను కలుపుకొని రా కేసీఆర్... బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధం అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాలను రద్దు చేయమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. మునుగోడులో బీజేపీ గెలవడమే లక్ష్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదని వ్యాఖ్యానించారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15నుంచి ప్రారంభిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే... ఇబ్రహీంపట్నం పేరును వీర పట్నంగా మారుస్తామన్నారు బండి సంజయ్.
ఇంకెంత దోచుకుంటావ్ కేసీఆర్..: సాద్వీ నిరంజన్ జ్యోతి
ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలో పరివర్తన వచ్చిందని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని జోస్యం చెప్పారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. నిజంగా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లే సమయం వచ్చిందన్నారు. కేసీఆర్, రాహుల్ గాంధీ, బెంగాల్, బీహార్, బీజేపీయేతర సీఎంలు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే హైదరాబాద్ లో ప్రజలకు భద్రత ఏర్పడిందని.. ఎలాంటి ఉగ్రదాడులు జరగడం లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఇంకెంత దోచుకుంటావ్ కేసీఆర్ అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీలకు డబ్బులు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ ట్విట్టర్ పలుకులు.. కేసీఆర్ మనవడిని రాజ్యసభకు..!
రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విటర్ పిట్ట కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.36లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేసింది యూపీ సీఎం అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ మనవడికి వయస్సు లేదు... లేకపోతే రాజ్యసభ సభ్యుడిని చేసేవారని ఎద్దేవా చేశారు. వరుణుడి కరుణతో తెలంగాణలో పంటలు బాగా పండాయన్న లక్ష్మణ్.. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ వనరులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ లాగే మునుగోడులో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని ప్రజలకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ విజయం కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీని గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను గౌరవించిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.
సభలో రాజా సింగ్ ఎక్కడ అంటూ అభిమానుల ఆందోళన
అయితే, ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదాలు వినిపించాయి. సభలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతుండగా... రాజాసింగ్ అభిమానులు కేకలు వేశారు. రాజాసింగ్ ఎక్కడా అంటూ... గట్టిగా అరిచారు. రాజాసింగ్ రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇంకా గందరగోళం ఎక్కువ అవుతుందని గమనించిన బండి సంజయ్... వాళ్లని సముదాయించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. ఇటీవల రాజాసింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పార్టీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రాజాసింగ్ జైలులో ఉన్నారు.