Covid Vaccination : నేటి నుంచి జీహెచ్ఎంసీలో 18 ఏళ్లు పైబడ్డవారందరికీ వ్యాక్సిన్...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం(జులై 1) నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఇందుకోసం 100 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
వ్యాక్సిన్ తీసుకునేవారు కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. కాబట్టి కోవిన్లో వివరాలు నమోదు చేసిన తర్వాతే సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

జీహెచ్ఎంసీలో ఇప్పటివరకూ 35 ఏళ్లు దాటినవారికి మాత్రమే ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం స్వయం సహాయక మహిళా సంఘాలు,కరోనా రిస్క్ ఎక్కువగా ఉండేవారికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. నేటి నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇస్తుండటంతో... వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖానికి మాస్కు,భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
కోవిడ్ కేసుల విషయానికి వస్తే... రాష్ట్రంలో బుధవారం(జూన్ 30) 917 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కి చేరింది. కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 3661కి చేరింది. నిన్నటి కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం తెలంగాణలో 13,388 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1,006 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,09,802 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా రికవరీ రేటు 97.26 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications