కేసీఆర్పై గెలిచి తెలంగాణ చరిత్రలో నిలుస్తా: వంటేరు, 'దేశ రాజకీయాల్లో బాబు కీలకపాత్ర'
హైదరాబాద్: డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతానని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన తనకు చాలా గౌరవం ఉందని, అయితే ఆయన పరిపాలనే అధ్వాన్నంగా ఉందని చెప్పారు.
Recommended Video
చంద్రబాబు టార్గెట్, 17 సీట్ల కోసం టీడీపీ పట్టు: కాంగ్రెస్కు కొత్త చిక్కులు తెచ్చిన టీఆర్ఎస్
వారిపై వ్యక్తిగత కక్ష లేదు
కేసీఆర్, హరీష్ రావులపై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని వంటేరు చెప్పారు. తాను ఎప్పుడు కూడా పేదల పక్షాన్నే ఉంటానని చెప్పారు. వారికి న్యాయం చేయడమే తన అభిమతమని అన్నారు. తాను నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నానని, ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. గజ్వెల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ, బీరు పంపిణీ చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్నారు.
కూటమిని చూసి తెరాసకు భయం
ఆరుగురు సభ్యుల నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ప్రజాకూటమిని చూస్తే తెరాసకు భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఆయన జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారని చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర
ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని మరో టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే కార్యాచరణలో భాగంగా చంద్రబాబు చేస్తున్న కృషిని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరిగే రాజకీయ పిరణామాలపై చంద్రబాబుకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు.
చంద్రబాబు చెప్పినట్లుగా వింటాం
అభ్యర్థుల ప్రకటన ఆలస్యం ఏమీ కాలేదని రావుల చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం మేం పోరాడటం లేదని చెప్పారు. ప్రస్తుతం పార్టీలో నిఖార్సయిన నేతలు ఉన్నారని చెప్పారు. సీట్లు, పదవుల కోసం పాకులాడే నాయకులు ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. మహాకూటమిలో చేరిన తాము ఓట్లు, సీట్ల కోసం పోరాడటం లేదన్నారు. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటామన్నారు. కూటమిలో నాలుగు పార్టీల ఉండటం వల్ల అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సర్దుబాటుపై ప్రకటన వస్తుందని చెప్పారు.