కెసిఆర్ గ్రీన్సిగ్నల్: మళ్లీ కారెక్కనున్న రాములమ్మ?
విజయవాడ: తెలంగాణ రాములమ్మగా పేరు గాంచిన ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తిరిగి కారెక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెసులో చేరి శాసనసభకు పోటీ చేసి విజయశాంతి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు కాస్తా దూరంగానే ఉంటున్నారు.
విజయశాంతి మాత్రమే కాకుండా కాంగ్రెసు హేమాహేమీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో దూకిన విజయశాంతికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. దీంతో విజయశాంతి మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సిగ్నల్ కోసం విజయశాంతి ఎదురుచూస్తోందని తెలిసింది.
మెదక్ పార్లమెంటు సీటు ఇచ్చి విజయశాంతిని అంతకు ముందు ఎన్నికల్లో కెసిఆర్ గెలిపించారు. గత లోకసభలో టిఆర్ఎస్ తరఫున కెసిఆర్, విజయశాంతి మాత్రమే ఉన్నారు.