నీది ఐదేళ్లే, నేను రిటైర్మెంట్ వరకు: టిడిపి నేతపైకి తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరి ప్రతాప్ రెడ్డి తదితరులకు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ జిల్లాలోని జైలు వద్ద ఓ పోలీస్ కానిస్టేబుల్ తెలుగుదేశం పార్టీ నేతల పైన విరుచుకు పడ్డారని తెలుస్తోంది. అంతేకాదు, అతను తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది.
జైలులో జిల్లా టిడిపి అధ్యక్షులు విజయ రమణారావును కలిసేందుకు రేవంత్, వంటేరు తదితరులు వెళ్లారు. రేవంత్ను, వంటేరును లోపలకు అనుమతించిన పోలీసులు మిగిలిన వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు, జైలు గార్డుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ వాగ్వాదం సందర్భంగా ఓ పోలీసు నాయకుల పైకి తుపాకీ కూడా ఎక్కుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి గమనించిన సిబ్బంది టిడిపి నాయకులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
సదరు పోలీస్ కానిస్టేబుల్ టిడిపి ఓ టిడిపి నేతపై తుపాకీ ఎక్కుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడని తెలుస్తోంది. దీనికి ఆయన ఎదురు తిరిగాడు. దీంతో మండిపడిన సదరు కానిస్టేబుల్.. నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నానని, నువ్వు రాజకీయాల్లో అధికారంలోకి వస్తే ఐదేళ్లు ఉంటావని, నేను రిటైర్మెంట్ వరకు విధుల్లోనే ఉండాలని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వారించాడని తెలుస్తోంది. దీంతో అక్కడ కాసేపు కలకలం రేగింది.