'హైదరాబాద్ కు డేంజర్ బెల్స్..'
హైదరాబాద్ : అగస్టు నెల వర్షాభావ పరిస్థితులతో రాబోయే రోజుల్లో నగరంలో మంచినీటి కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో కూడా వరుణుడు కనిపించకపోతే.. హైదరాబాద్ కు నీరందించే జలాశయాలు మరింత అడుగుకు పడిపోయే ప్రమాదం ఉండడంతో.. సెప్టెంబర్ నెల వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు అధికారులు.
ప్రస్తుతం జంట నగరాలకు నీరందిస్తున్న ఎల్లంపల్లి, అక్కంపల్లితో పాటు సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి నగరానికి 355 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. అగస్టు నెలలో సరైన వర్షాలు లేకపోవడంతో.. జలాశయాల్లో నీటిమట్టం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఆందోళన చెందుతోన్న వాటర్ బోర్డు అధికారులు సెప్టెంబర్ లో నమోదయ్యే వర్షాలపైనే ఆశలన్నీపెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే.. మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు జరుగుతుండడంతో.. ఆయా ప్రాంతాలకు రివర్స్ మెథడ్ లో గోదావరి నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. ఇక జంట నగర జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలో నీటి మట్టం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.