Telangana : తెలంగాణలో నేడు,రేపు ఓ మోస్తరు వర్షాలు.. రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం
తెలంగాణలోని పలు జిల్లాల్లో శని,ఆదివారాల్లో(జులై 3,4) ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం... ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్న నేపథ్యంలో వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.
గురువారం(జులై 1) ఉదయం నుంచి శుక్రవారం(జులై 3) రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం... అత్యధికంగా మహబూబాబాద్,బయ్యారంలో 11సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్లోని దొంగల ధర్మారంలో 10.7సెం.మీ,కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాంలో 10,మెదక్ బూర్గుంపాడులో 9,జగిత్యాలలోని పెగడపల్లిలో 8 సెం.మీ,ఇల్లెందులో 8సెం.మీ వర్షపాతం నమోదైంది.
వర్షాలతో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 7 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో వాతావరణం చల్లబడింది. పగటిపూట అత్యధికంగా భద్రాచలంలో 27.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో తొలకరి జల్లులు నమోదయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. అయితే మధ్యలో కొద్దిరోజులు వర్షం ముఖం చాటేయడంతో అన్నదాత దిగులు చెందాడు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది.