పవన్ కళ్యాణ్ పేరెత్తగానే ఊగిపోయారు, దద్దరిల్లిన ప్రాంగణం: కాసేపు ఆగిన కేటీఆర్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన పేరును ఎత్తితే చాలు యువత ఊగిపోతారు. అది పార్టీ సమావేశం అయినా, సినిమా కార్యక్రమం అయినా జనసేనాని పేరు చెబితే యువత కేకలు వేస్తారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావుకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన శనివారం నాడు హైదరాబాదులో జరిగిన మన హైదరాబాద్ - మన అందరి హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఎలాంటి వివక్ష లేని పాలన
కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో తాము ఎలాంటి వివక్ష లేకుండా పాలించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ క్రమంగా పెరుగుతోందని, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని చెప్పారు. నగరంలోని సీమాంధ్రులు, ఇతర రాష్ట్రాల కన్నడిగులు, మరాఠీలు, పంజాబీలు, బెంగాళీలు కావొచ్చునని.. ఎవరైనా అందరూ సమానమే అన్నారు. హైదరాబాదులో కరెంట్ బాగుంటే అందరికీ బాగుంటుందని, మంచి నీటి సరఫరా బాగుంటే అందరికీ లాభమని, శాంతిభద్రతలు బాగుంటే అందరికీ లాభమని చెప్పారు.
వ్యతిరేకించిన వారు కూడా మెచ్చుకుంటున్నారు
హైదరాబాదుకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇంకా వస్తాయని కేటీఆర్ అన్నారు. కులం, మతం, ప్రాంతం అనకుండా అందరిని కలుపుకొని వెళ్దామని చెప్పారు. కేసీఆర్ పాలన చూసి అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. మనలను వ్యతిరేకించిన వారు కూడా కేసీఆర్ను మెచ్చుకుంటున్నారని చెప్పారు. మీరు బాగా పని చేస్తున్నారని ప్రశంసిస్తున్నారని తెలిపారు.
పవన్ పేరెత్తగానే దద్దరిల్లిన సభ
ఈ సందర్భంగా కేటీఆర్ జనసేన అధినేత గురించి ప్రస్తావించారు. పెద్దలు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ గారు అని అనగానే ఆ సభలో నినాదాలు హోరెత్తాయి. ఆ నినాదాల దద్దరిల్లుతుంటే కేటీఆర్ కొన్ని క్షణాల పాటు ప్రసంగం ఆపవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయనే ఆగండి అని చేత్తో సైగ చేసి, తన ప్రసంగం కొనసాగించారు.
కేసీఆర్ వచ్చి పొగిడారు
కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పవన్ కూడా స్వయంగా కేసీఆర్ వద్దకు వచ్చి కలిశారని, అడగకపోయినా మీరు బాగా చేస్తున్నారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని పత్రికాముఖంగా చెప్పి ప్రశంసించారని అన్నారు.
హైదరాబాద్లో స్థిరపడిన నాకు ఉన్న హక్కే మీకూ
తాను కరీంనగర్లో పుట్టానని, హైదరాబాదులో పెరిగానని కేటీఆర్ చెప్పారు. తాను చదువుకునే సమయంలో హైదరాబాదులో నిత్యం కర్ఫ్యూ ఉండేదని చెప్పారు. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన తనకు ఈ నగరంపై ఎంత హక్కు ఉందో, ఈ దేశంలోని ఏ మూల నుంచి వచ్చిన వారికైనా అంతే హక్కు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ నగరం అందరి గడ్డ అన్నారు. వంద శాతం మనం కలిసిమెలిసి ఉంటేనే హైదరాబాద్ ముందుకు వెళ్తుందన్నారు.