ఎవరీ బాహుబలి: చరిత్రకారులు ఇచ్చిన సమాధానం..! (ఫోటోలు)
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా భారీ తారాగణం, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో నేనెవర్నీ?? అంటూ ఆగ్రహంతో బాహుబలి ఓ ప్రశ్న వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు చరిత్రకారులు ఇచ్చిన సమాధానం తెలుసుకుంటే కొంత ఆశ్చర్యం కలగమానదు.
అందుకు కారణం బాహుబలి ఎవరో కాదు మనోడే అంటూ నమస్తే తెలంగాణ ఓ కథనంలో పేర్కొంది. బాహుబలి... మహా యోధుడు... ఒకనాటి బహుధాన్యపురం లేక పోధనపురం నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ను, రాజధానిగా చేసుకొని దక్షిణాపథాన్ని పాలించిన పరాక్రమ శూరుడు.
ఆయన తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజధాని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. జైన చారిత్రకుల ప్రకారం బాహుబలి నాడు పరిపాలించిన పౌధనపురమే(వాడుకలో పోధనపురం) నేటి బోధన్. బాహుబలి శిల్పాలు, జైనమత ఆధారాలు నిజామాబాద్ మ్యూజియంలోనూ ఇప్పటికీ ఉన్నాయంట.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బాహుబలి బోధన్ అటవీ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 525 ధనుస్సుల ఎత్తైన బాహుబలి విగ్రహం బోధన్ ప్రాంతంలో ఉండేదని, అది కాలగర్భంలో కలిసిపోయిందని, ప్రస్తుతం శ్రావణబెళగొళ విగ్రహానికి అదే స్ఫూర్తి అని చరిత్రకారులు చెప్తున్నారు.

దక్షిణాదిని పరిపాలించిన బాహుబలి
చరిత్ర ప్రకారం.. నేటి బోధన్ రాజధానిగా ఉన్న దక్షిణాపథాన్ని బాహుబలి పాలించుకోవటానికి ఆయన తండ్రి వృషభనాథుడు అనుమతి ఇస్తాడు. ఉత్తర భారతంలో అనేక రాజ్యాలు జయించిన భరతుడి కన్ను సవతి తమ్ముడు బాహుబలి పాలిస్తున్న రాజ్యంపై పడుతుంది. బాహుబలి లొంగకపోవటంలో భరతుడు యుద్ధం ప్రకటిస్తాడు. భరతుడు గొప్ప చక్రవర్తి.. అసలు ఈ రాజు పేరిటనే భారతదేశం అన్న పేరు వచ్చింది.. అని జైన గ్రంథాలు చెప్తున్నాయి. శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుడు పాలించటంవల్ల ఈ దేశానికి ఆ పేరు వచ్చిందన్న విషయాన్ని జైనులు అంగీకరించరు.

ప్రాణ నష్టం తప్పదని ఒక అంగీకారం
ఇక, అన్నదమ్ములు ఇద్దరూ యుద్ధానికి సన్నాహాలు చేస్తుండటంతో... యుద్ధంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పదని భావించిన ఇరు రాజ్యాల మంత్రులు ఒక అంగీకారానికి వస్తారు. సైన్యాల మధ్య యుద్ధాలు కాకుండా, ఇద్దరు రాజులు నిరాయుధంగా యుద్ధం చేయాలని, ఆ యుద్ధంలో ఎవరు విజేతగా నిలిస్తే ఓడిన రాజు రాజ్యాన్ని అప్పగించాలని నిర్ణయిస్తారు. ఈ ఒప్పందం మేరకు భరతుడు, బాహుబలి మధ్య ముందుగా దృశ్య యుద్ధం, జల యుద్ధం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భుజబల సంపన్నుడైన బాహుబలి విజేతగా నిలుస్తాడు. అనంతరం జరిగిన మల్ల యుద్ధంలోనూ ఒక దశలో భరతుడిపై బాహుబలి పైచేయి సాధిస్తాడు.

బోధన్ ప్రాంతంలోని అడవుల్లో తపస్సు
పోధన రాజ్యంలోని కీకారణ్యంలో బాహుబలి ఘోరమైన తపస్సును ఆచరించినట్లు చరిత్రకారులు అంటున్నారు. నాడు ఇంద్రపురిగా పిలవబడుతున్న నేటి నిజామాబాద్ ప్రాంతంలోనే ఈ తపస్సు చేసినట్లు వారు చెప్తున్నారు. బాహుబలుడు కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్లపై నిలబడి) తపస్సు ఆచరించాడు. ఆ ఘోర తపస్సులో బాహుబలి కాళ్లకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. ఈ రూపాన్ని చూసే అన్న భరతుడు తమ్ముడు బాహుబలిపై ఎనలేని గౌరవంతో దేశంలోనే అతి పొడవైన బాహుబలి విగ్రహాన్ని తయారుచేయించాడన్నది చరిత్రకారుల భావన.. ఆ విగ్రహాన్ని ఇంద్రగిరి(నిజామాబాద్) కొండపై ప్రతిష్టించేందుకు యత్నించి విఫలమైనట్లు తెలుస్తున్నది.

మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు
జైన మతానికి సంబంధించిన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇక్షాకు వంశానికి ఆయనే ఆద్యుడని జైనుల ప్రగాఢ విశ్వాసం. సుమంగళ, సునంద అనే ఇద్దరు రాకుమార్తెలను వివాహమాడాడాయన. సుమంగళకు 99మంది కుమారులు, ఒక కుమార్తె బ్రహ్మీ జన్మించింది. 99 మందిలో పెద్ద కుమారుడు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించినట్లు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తున్నది. వృషభనాథుడు చాలాకాలం రాజ్యాధికారంలో ఉన్నాడు.

అడవుల్లో జ్ఞానోదయం
కాల క్రమేణా ఐహిక జీవితంపై విరక్తితో తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచి, సన్యాసం స్వీకరించి, అడవులకు వెళ్లిపోయాడు. అనేక ఏళ్ల తర్వాత జ్ఞానోదయం పొందాడు. దీనినే జీనత్వం పొందడం అంటారు. అనంతరం దేశాటనచేస్తూ సత్యాలను తెలియజేస్తూ ప్రజలకు చేరువయ్యాడు. అనేక మంది వృషభనాథుడి మతాన్ని స్వీకరించారు. అదే జైనమతంగా పరిఢవిల్లుతున్నది. వృషభనాథుడి కుమారుల్లో పెద్ద వాడైన భరతుడు అనంతరం కాలంలో మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను జయించి వాటి రాజులను సామంతులుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన 98 మంది తమ్ముళ్లు రాజ్యాన్ని వదిలేసి తమ తండ్రి వద్దకు వెళ్లి ఆయన శిష్యులుగా చేరిపోయారని జైన ఇతిహాసం చెబుతున్నది.

525 ధనుస్సుల ఎత్తయిన విగ్రహం..
బాహుబలి విగ్రహాన్ని 525 ధనుస్సుల పొడువుతో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంత పెద్ద భారీ విగ్రహాన్ని భరతుడు నాటి పోదనపురం (నేటి బోధన్)లో నిర్మించాడు. ప్రస్తుతం ఇంత పెద్ద భారీ విగ్రహం ఆనవాళ్లు బోధన్ ప్రాంతంలో కనపడటంలేదు. కీస్తు పూర్వం 6వ శతాబ్దానికి వందల ఏళ్లనా డే బోధన్ ఒక మహాపట్టణంగా ఉండేదని చరిత్ర చెబుతున్న విషయం. అటువంటి బోధన్లో ఉన్న బాహుబలి విగ్రహాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి జైనులు బోధన్కు వచ్చేవారట... ఈ బాహుబలి విగ్రహానికి కుక్కుటేశ్వరుడు అన్న పేరు కూడా ఉండేది.

శ్రావణ బెళగొళ విగ్రహానికి స్ఫూర్తి
ప్రస్తుతం కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో ఉన్నది బాహుబలి విగ్రహం. గోమఠుడుగా పేరొందిన చాముండరాయుడు ప్రతిష్ఠించటంతో దీన్ని గోమఠేశ్వర విగ్రహం అనీ పిలుస్తారు. బోధన్ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న బాహుబలుడి విగ్రహాన్ని చూసే దీన్ని నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పటికీ జైన అవశేషాలు, జైన విగ్రహాలు బోధన్లో కనపడుతాయి. కొన్ని జైన ఆలయాలు హిందూ దేవుళ్ల ఆలయాలుగా రూపాంతరం పొందాయి. బోధన్ తహసీల్దార్ కార్యాలయం, గాంధీ పార్కు తదితర ప్రాంతాల్లో జైన విగ్రహాలు ఉన్నాయి. నవీపేట్ మండలం బినోలాలో బాహుబలి విగ్రహం ఇప్పటికీ ఒక ఆలయం వద్ద ఉంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications