ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.
ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినేట్ హోదా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి జూన్లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. పలుమార్లు విచారణ చేపట్టింది.
సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ - నిబంధనల మేరకే కేబినెట్ హోదా కల్పించామని, తగిన జీతాలు, సౌకర్యాలు కల్పించేందుకే హోదా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.

దానిపై హైకోర్టు బెంచ్ స్పందిస్తూ - కావాలంటే జీతాలు ఇచ్చుకోవచ్చునని, సౌకర్యాలు కల్పించుకోవచ్చునని, అంతే తప్ప ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వకూడదని ఆదేశించింది. సలహాదారులు, ఇతర హోదా తీసుకున్న వారు మంత్రులతో సమానం కాదని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications