'నోట్లను రద్దును కేసీఆర్ సమర్థించడంలో ఆంతర్యమేంటి?'
నోట్ల రద్దును సమర్థించడంలో సీఎం కేసీఆర్ ఆంతర్యమేంటో స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: నోట్ల రద్దు వ్యవహారాన్ని తొలుత వ్యతిరేకించి ఆ తర్వాత దాన్ని సమర్థించడంలో ఆంతర్యమేంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ సీఎల్పీ నేతలంతా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
నోట్ల రద్దు వల్ల సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరడం లేదని డీకె అరుణ మండిపడ్డారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, డబుల్ బెడ్ రూమ్ వంటి ఎన్నికల హామిలను కేసీఆర్ నెరవేర్చకపోవడంపై అసెంబ్లీలో నిలదీస్తామని డీకె అరుణ చెప్పారు.
ఇటీవలి వర్షాలకు హైదరాబాద్ నగరం ఎదర్కొన్న సమస్యలు, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన తీరును అసెంబ్లీలో ఎండగడుతామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడానికి కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు రాని పక్షంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశాలపై కూడా ఆలోచిస్తామని భట్టి పేర్కొన్నారు.