ఇంట్లో గొడవ, మహిళా టెక్కీ ఆత్మహత్య: తెలిసినా రాని భర్త
హైదరాబాద్: మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. శైలజ అనే టెక్కీ తన భర్తతో గొడవ కారణంగా, ఆయన లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పంజాగుట్ట ఎస్సై సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన శైలజ (34), శరత్ బాబు భార్యభర్తలు. ఇద్దరూ సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె కాకినాడలో బంధువుల వద్ద ఉంటూ చదువుకుంటోంది. మంగళవారం వీరి మధ్య ఘర్షణ జరిగింది.
అనంతరం శరత్ బాబు విధులకు వెళ్లగా ఇంట్లోనే ఉన్న శైలజ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. ఇది గుర్తించిన అపార్టుమెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త ఆచూకీ లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వీరు రాజ్ భవన్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో ఉంటున్నారు. శైలజ బేగంపేటలోని టాటా కన్సల్టెన్సీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా, భర్త విప్రోలో టెక్కీగా పని చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య మృతి విషయం తెలిసినా సాయంత్రం దాకా భర్త రాలేదని తెలుస్తోంది.