బెంగళూరు సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని తాకిన అతి కొద్దిరోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కర్ణాటకలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. కర్ణాటకకు ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం ఉండొచ్చు. పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది.
ఐఎండీ తాజా అంచనాల ప్రకారం, కర్ణాటక మధ్య తీర ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. బెంగళూరు, కోలార్, చిక్ బళ్లాపురా, తుమకూరు వంటి జిల్లాలు 'ఆరెంజ్ అలర్ట్' పరిధిలో ఉన్నాయి. సోమవారం నాటికే మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. చురుగ్గా కదులుతున్నాయి.

అరేబియా సముద్రం మీదుగా రుతుపవనాలు బలపడుతుండటంతో, కర్ణాటక తీర ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షపాతం గణనీయంగా పెరగనుంది. బెంగళూరులో రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టి, నగర వాసులకు వేసవి వేడి నుండి ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం రుతుపవనాలు కర్ణాటక మీదుగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ ముందుకు సాగుతున్నాయి.
రుతుపవనాల కదలికలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తుండగా, బంగాళాఖాతంలో కూడా వాతావరణ వ్యవస్థ బలపడుతోంది. అదే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ వంటి తూర్పు రాష్ట్రాల్లో కూడా వర్షపాతం పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న కర్ణాటక రైతులకు ఈ వర్షసూచన శుభవార్తగా మారింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యంగా ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉత్తరాదిలో వీటి ప్రవేశం ప్రస్తుత వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ చివరి నాటికి ఢిల్లీని చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications