తెలంగాణలో "చలి" పులి పంజా.. ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ !!
తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడం సాధారణమే కాని ఈసారి వాతావరణం మరింత భిన్నంగా మారినట్టు కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటుండగా, సాయంత్రం ఆరు గంటల నుంచే చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో సాయంత్రం వేళల్లో ప్రజలు బయట తిరగడానికి జంకుతున్నారు. దీనికితోడు ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో చలి మరింత తీవ్రంగా మారింది.
ఈ క్రమంలోనే రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక చలి ప్రభావం చూపే జిల్లాలను గుర్తించి ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఈ సమయంలో వైద్యులు ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వారు చెబుతున్నారు.

ఇక వాతావారణ శాఖ అలర్ట్ ప్రకటించిన జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా ఉండటంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. తెలంగాణ కాశ్మీర్ అని పిలువబడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గట్టిగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బజార్ హత్నూర్ మండలంలో 8.9 డిగ్రీల సెల్సియస్, సోనాల మండలంలో 7.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం.
మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడి 48 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశలో కదిలి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది.
ఇప్పటికే చలి తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు వస్తున్నారు. నాలుగు, ఐదు గంటల్లోగా పనులన్నీ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications