బడా మోసం.. దగా పడ్డ టెక్కీలు!: బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ..
శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరు రూ.1.3 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు చెల్లించారు. మొత్తం 59మంది ఈ సంస్థకు డబ్బులు చెల్లించగా.. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సంస్థ డబ్బులు ఇవ్వడం మానేసింది.
హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి.
ఇటీవలే హైటెక్ సిటీలో అవెన్యూ అనే ఓ ఫేక్ ఐటీ సంస్థ బోర్డు తిప్పేయగా.. తాజాగా సోమాజిగూడలోని మరో కంపెనీ సైతం బోర్డు తిప్పేసింది. లక్షల కొద్ది డబ్బులు వెచ్చించి అందులో జాబ్ తెచ్చుకున్న నిరుద్యోగులంతా ఇప్పుడు మా పరిస్థితేంటని? వాపోతున్నారు.
సోమాజిగూడలోని ఫోర్డ్ షోరూం రెండో అంతస్తులో ఉన్న సెంట్రిక్స్ టెక్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఈ బడా మోసానికి పాల్పడింది. తొలుత సాఫ్ట్ వేర్ శిక్షణా సంస్థ పేరుతో ప్రారంభమై.. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ సంస్థ యాజమాన్యం ప్రకటనలు గుప్పించింది.
తమ సంస్థలో సాఫ్ట్ వేర్ శిక్షణ ముగించుకున్నవారికి 2.60 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు వల వేసింది. అంతేకాదు, ఒకవేళ ఉద్యోగం రాని పక్షంలో నెలకు రూ.12వేలు చెల్లిస్తామని కూడా చెప్పింది.
రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..
ఈ మాటలు నమ్మిన చాలామంది నిరుద్యోగులు లక్షల ఫీజు చెల్లించి..సెంట్రిక్స్ టెక్ లో చేరారు. శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరు రూ.1.3 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు చెల్లించారు. మొత్తం 59మంది ఈ సంస్థకు డబ్బులు చెల్లించగా.. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అటు ఉద్యోగాలు ఇప్పించకపోగా.. ఇటు డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది సంస్థ. ఇదేంటని నిలదీస్తే.. సీఈవో రాజీవ్ అలియాస్ రాహుల్ రెడ్డి, ఇన్చార్జీ కార్తీక్ అలియాస్ రాజేష్ లు నీళ్లు నమిలారు.
మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులంతా యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో.. రాజీవ్, కార్తీక్ లు తమ సెల్ ఫోన్స్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఆపై బాధితులంతా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ తతంగమంతా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.