రేపు మహబూబ్నగర్కు వైఎస్ షర్మిల: ఆ యూనివర్శిటీ వద్ద దీక్ష..
మహబూబ్నగర్: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్శిటీ వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ఈ నిరహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా సమన్వయ కమిటీ నాయకులు పర్యవేక్షిస్తోన్నారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని వైఎస్సార్టీపీ నేతలు చెప్పారు.
ఏపీలో వినాయక చవితిపై రాజకీయ రచ్చ: అక్కడ 3 రోజులకు కుదించిన బీజేపీ సర్కార్: ప్రసాదాలకు నో
వనపర్తితో మొదలు..
ఇదివరకు- తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారామె. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు.
పలు జిల్లాల్లో దీక్షలు..
తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రకటించిన 50 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. ఈ నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం అదే. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన తరువాత వైఎస్ షర్మిల కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట్ వంటి జిల్లాల్లో ప్రతి మంగళవారం నిరాహార దీక్షను చేపడుతున్నారు.
పార్టీ నేతలతో కలిసి..
ఈ సారి ఆమె మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్శిటీ వద్ద నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్సార్టీపీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఏపూరు సోమన్న, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉంటారు. మహబూబ్నగర్ జిల్లా పార్టీ కోఆర్డినేటర్లు ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్పాండ్లోని తన నివాసం నుంచి ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో మహబూబ్నగర్కు చేరుకుంటారు.
పాలమూరు యూనివర్శిటీ వద్ద
మార్గమధ్యలో- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. షాద్నగర్, జడ్చర్లల్లో ఆమె వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పిస్తారని తెలుస్తోంది. అనంతరం మహబూబ్నగర్లో వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించిన తరువాత.. పాలమూరు యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కూర్చుంటారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ..
రాష్ట్రంలో మొత్తం 11 విశ్వవిద్యాలయాలు ఉండగా.. అందులో ఏడు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు నూటికి నూరుశాతం లేరని వైఎస్సార్టీపీ చెబుతోంది. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తప్పితే.. మిగిలిన వాటిలో 90 శాతం బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరిస్తోంది. విశ్వవిద్యాలయాల్లోనే 2,837 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదని వైఎస్ షర్మిల రేపటి నిరుద్యోగ నిరాహార దీక్షలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Recommended Video
రాజకీయ దురుద్దేశంతోనే..
వైఎస్ షర్మిల ప్రతి వారం నిర్వహిస్తోన్న నిరుద్యోగ నిరాహార దీక్షల వల్ల- ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, అవి విడుదల కాకపోవడం వల్ల నిరాశతో ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు భరోసా లభిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోవంక- అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. దీన్ని తప్పు పడుతోంది. వైఎస్ షర్మిల తన రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగం అంశాన్ని వివాదాస్పదం చేస్తోన్నారని విమర్శిస్తోంది.