జన్మంతా తెలంగాణకు రుణపడి ఉంటాం... షర్మిలమ్మను మీ చేతుల్లో పెడుతున్నా.. ఇక ఆమె మీ బిడ్డ: విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విలువలతో,కమిట్మెంట్తో రాజకీయం చేశారో... అవే విలువలు,కమిట్మెంట్తో తెలంగాణలో షర్మిలమ్మ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. నమ్మినవాళ్ల కోసం,ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన వెళ్లే వ్యక్తిత్వం రాజశేఖర్ రెడ్డిది అని... జగన్ కూడా అదే పాటించారని అన్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే బాటలో నడవబోతున్నారని చెప్పారు. ఈ గడ్డ ప్రజల మీద గుండె నిండా మమకారం నింపుకుని షర్మిలమ్మ ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు.'నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా... ఇక ఆమె నా బిడ్డ కాదు మీ బిడ్డ.. మీ కుటుంబంలో సభ్యురాలు...' అని పేర్కొన్నారు.

షర్మిలమ్మను నిండు మనసుతో దీవించండి : విజయమ్మ
సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజు చేవెళ్ల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారని వైఎస్ విజయమ్మ గుర్తుచేశారు. ఆనాడు జనం తినడానికి తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే... వారిని ఓదార్చడానికి,ధైర్యం చెప్పడానికి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారన్నారు. ఇప్పుడదే రోజు షర్మిలమ్మ ఖమ్మం గుమ్మం నుంచి రాజకీయంగా తన మొదటి అడుగు వేస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి 12 ఏళ్లు గడిచినా ఆయనపై ఇంకా ప్రేమాభిమానం,ఆదరణ చూపిస్తున్నందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డికి భార్యగా,షర్మిలకు అమ్మగా నిండు మనసుతో ఆమెను దీవించాలని మీ ముందుకొచ్చానని అన్నారు.

జన్మంతా రుణపడి ఉంటాం : విజయమ్మ
రెండు రాష్ట్రాలు వేరైనా.. ఈ నేలతో,ఈ మనుషులతో,ఇక్కడి హృదయాలతో తమ సంబంధం చెరిగిపోలేదని చెప్పడానికి ఇక్కడి వచ్చానన్నారు. 'తెలంగాణకు జన్మంతా మా కుటుంబం రుణపడి ఉంటుంది.. రాజశేఖర్ రెడ్డి వెళ్లిపోయాక... ఎంతోమంది నేతలు మా కుటుంబాన్ని విడిచి వెళ్లినా... జనం మాత్రం మాతోనే ఉన్నారు.. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాం.' అని విజయమ్మ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో తెలంగాణ ప్రజలది కీలక పాత్ర అన్నారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఈ నేల పైనే ఎక్కువమంది ప్రాణాలు వదిలారని చెప్పారు.

ఆనాడే ఈ నేలతో అనుబంధం ముడిపడింది...
తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నానని షర్మిల చెప్పినప్పుడు తాను ఎంతగానో సంతోషించానని విజయమ్మ అన్నారు. తెలంగాణకు సేవ చేయడం ద్వారా ఈ నేల రుణం తీర్చుకుంటుందన్నారు. జగన్ చేయాల్సిన ఓదార్పు యాత్ర షర్మిలమ్మ చేసినప్పుడే... ఈ నేలతో దేవుడు ఆమెకు అనుబంధం రాసిపెట్టాడన్న విషయం అర్థమైందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా షర్మిలమ్మ పనిచేస్తుందని... మీరంతా ఆమెకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నానని అన్నారు. 'షర్మిలమ్మ తెలంగాణ చరిత్ర చదువుతోంది... ఇక్కడి సమస్యలను అధ్యయనం చేస్తోంది.. ప్రతీ జిల్లాకు,ప్రతీ ఇంటికి,ప్రతీ వ్యక్తికి సమన్యాయం చేసేందుకు... నీతివంతమైన రాజకీయాలతో మీ మందుకు వస్తోంది...' అని విజయమ్మ పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణయుగం : విజయమ్మ
'రాజశేఖర్ రెడ్డి గొప్ప మానవతావాది... ఆయన పార్టీలు,మతాలు,ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసేవారు. అందరు మనుషుల్లో ప్రవహించేది ఎర్రటి రక్తమేనని... అలాంటప్పుడు మనుషుల్లో ఎందుకీ తేడాలని అనేవారు. అందుకే అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. రాజశేఖర్ రెడ్డి ఏధైనా మంచి చేయాలనుకుంటే ఎంతకైనా వెళ్తారు. స్వపక్షంతో అయినా,విపక్షంతో అయినా.. పోరాడి మరీ అనుకున్నది చేస్తారు. సంక్షేమ,అభివృద్దితో... రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణ యుగాన్ని తలపించింది. ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో దేనిపై ఒక్క పైసా పన్ను పెంచలేదు.అది రాజశేఖర్ రెడ్డి గారి రికార్డు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర రూ.50 పెంచితే... అది కూడా ప్రభుత్వమే భరించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్,పీవీ హైవే ఆయన దార్శనికతకు నిదర్శనం.' అని విజయమ్మ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications