తిరుమలలో మరో ఫుడ్ కౌంటర్ ప్రారంభం - మే 4 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు..!!
Tirumala: తిరుమలో భక్తుల కోసం టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం తాజాగా మరో ఫుడ్ కౌంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్ తో పాటుగా తిరుమలో మరి కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం నేడు వర్చ్యువల్ సేవా టికెట్లు..రేపు మే మాసానికి సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే 4 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
మరో ఫుడ్ కౌంటర్:తిరుమల భక్తుల కోసం మరో ఫుడ్ కౌంటర్ ప్రారంభమైంది. తిరుమలలో ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీటి సరసన మరో ఫుడ్ కౌంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. పీఏసీ-1లో బస చేసే సామాన్య భక్తులకు ఈ ఫుడ్ కౌంటర్ సౌకర్యవంతంగా ఉండనుంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వీటితోపాటు రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం ఫుడ్ కౌంటర్లు మూడుకు చేరాయి.

ఢిల్లీలో వార్షిక బ్రహ్మోత్సవాలు:న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 3న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు ఏప్రిల్ 25వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. తొలి రోజున ఉదయం - ధ్వజారోహణం, రాత్రి.. పెద్దశేష వాహన సేవలు ఉంటాయి.
రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు జారీ:అప్పటి నుంచి 12వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఈ రోజు (ఏప్రిల్ 24) ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా మాత్రమే టోకెన్లు పొందాలని టీటీడీ సూచించింది.












Click it and Unblock the Notifications