ప్రతి శుక్రవారం కోర్టుకు..వకీల్ సాబ్ను చూస్తే జగన్కు వణుకు: థియేటర్ వద్ద బీజేపీ నిరసన
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గంపై పట్టును నిలుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్, అధికార పార్టీ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ-జనసేన కసరత్తు చేస్తోన్నాయి. హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ విడుదల కావడం.. రాజకీయాలను మరింత రంజుగా మార్చివేశాయి.

బెనిఫిట్ షో రద్దుతో బీజేపీ-జనసేన భగ్గు..
వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు జగన్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం కూడా రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తిరుపతిలో నిరసన చేపట్టారు. జయశ్యాం థియేటర్ వద్ద బైఠాయించారు. వెంటనే బెనిఫిట్ షోనకు అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు.

పవన్ కల్యాణ్కు భయపడి..
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా చూడటానికి వచ్చానని సునీల్ దియోధర్ చెప్పారు. పవన్ కల్యాణ్ దెబ్బకు భయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సినిమాకు సంబంధించిన అన్ని బెనిఫిట్ షోలను రద్దు చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతుంటేనే వైఎస్ జగన్ ఇంతలా భయపడుతుంటే.. పరిపాలన ఎలా సాగించగలరని ఎద్దేవా చేశారు. మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో భారీ పరిణామాలు చోటు చేసుకోబోతోన్నాయని చెప్పారు.

మోడీ- పవన్ కల్యాణ్ కాంబినేషన్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ-పవన్ కల్యాణ్, భారతీయ జనతాపార్టీ-జనసేన కాంబినేషన్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో విడుదల కాబోతోందని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించడానికే వైఎస్ జగన్ భయపడితే.. ఇక ఈ కాంబినేషన్ను ఎలా తట్టుకోగలరని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ రౌడీయిజానికి, ఆకృత్యాలకు నరేంద్రమోడీ- పవన్ కల్యాణ్ కాంబినేషన్ తెర దించుతుందని ఆయన జోస్యం చెప్పారు.

మత మార్పిళ్లు.. అవినీతి పరిపాలనకు తెర
రాష్ట్రంలో బలవంతంగా చోటు చేసుకుంటోన్న మత మార్పిడులు, అవినీతి పరిపాలనకు తెర దించబోతున్నామని సునీల్ దియోధర్ హెచ్చరించారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఏపీలో మత మార్పిళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ.. తాను వకీల్ సాబ్ సినిమాను చూడబోతున్నానని సునీల్ దియోధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ సినిమాను మిస్ కాకుండా చూడాలని సూచించారు.
Recommended Video
వకీల్ సాబ్ను చూస్తే భయమే మరి..
వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని రత్నప్రభ గెలవబోతున్నారనడానికి ఇదే నిదర్శనమని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకునే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ వకీల్ సాబ్ను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే అలవాటు ఉన్న వారే వకీల్ సాబ్ను చూసి భయపడుతుంటారని, అది సహజమని సునీల్ దియోధర్ చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications