తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: ఇక ఎలాంటి ఇబ్బందీ లేకుండా..!!
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. గురువారం 56,680 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 18,947 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.54 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. గత ఏడాది వేసవి సీజన్ కంటే కూడా ఇప్పుడు వచ్చే భక్తులు రెట్టింపుగా వస్తారని భావిస్తోన్నారు. తిరుమలలో రద్దీని నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. దీని మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలు. 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మూడో దశ పనులు కూడా ఇవ్వాళ్టితో ముగిశాయి.
దీనితో శ్రీనివాస సేతుపై వాహనాల రాకపోకల ట్రయల్ రన్ను చేపట్టారు అధికారులు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ట్రయల్ రన్ను ప్రారంభించారు. మూడవ దశ నిర్మాణ పనుల్లో భాగంగా ఆరు స్టీల్ గర్డర్లను అమర్చారు. దీని కోసం టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేశారు.

ట్రయల్ రన్ ప్రారంభం సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్ నుంచి రేణిగుంట రోడ్డు మార్గం ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. మొత్తం ఏడు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్లో ఒక కిలోమీటర్ పనులు పెండింగ్లో ఉన్నాయని, అవి కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి త్వరలోనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మే 15వ తేదీ లేదా అంతకంటే ముందే- ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకుని రావాలని నిర్ణయించుకుంది టీటీడీ. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఆరంభం అయ్యే నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నామని, గడువులోగా మూడో దశ నిర్మాణ పనులను పూర్తి చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications