చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, 11 గంటల పాటు క్లోజ్
చంద్ర గ్రహణం 8వ తేదీన ఏర్పడనుంది. సాయంత్రం గంట పాటు ఉండనుంది. అయితే అంతకుముందు సూకత్ కాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేస్తారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు.
మంగళవారం మొత్తం 11 గంటల పాటు మూసివేస్తారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. చంద్ర గ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగనుంది. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
చంద్ర గ్రహణం నేపథ్యంలో నవంబరు 7వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబోవడం లేదని టీటీడీ పేర్కొంది. నవంబరు 8వ తేదీన గ్రహణం రోజున తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.
ఇటీవల చివరి సూర్య గ్రహణం కూడా పూర్తయ్యింది. 15 రోజుల్లో.. కార్తీక పౌర్ణమి రోజున మంగళవారం చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణంపై చాలా మందికి అపొహలు ఉన్నాయి. గ్రహణాలను అశుభానికి సంకేతంగా భావిస్తారు. గ్రహణం కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు.