తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగదు, నగలే తప్ప .. ఎవరైతే ఏంటి అనుకున్నారో ఏమో కానీ తమ పని కానిచ్చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిని నిలువుదోపిడీ చేశారు. దీంతో వారు జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చేతివాటం ..
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. మంగళవారం రాత్రి మణిమంజరి అతిథిగృహంలో బసచేశారు. తెల్లవారి శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధమై .. నిద్రపోయారు. కానీ వారి ఉన్నది తిరుమలలో .. అదీ ఇటీవల దొంగతనాలు ఎక్కవయ్యాయనే విషయాన్ని మరిచారు. ఇంకేముంది దొంగలు రంగప్రవేశం చేశారు. దాదాపు 80 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. తెల్లవారి నగదు, నగలు, ఫోన్ కనిపించకపోవడంతో .. ఆశ్చర్యపోవడం వారి వంతైంది. వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి బంధువుల వస్తువులకే భద్రత లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

భక్తుడిపై దాడి ...
మరోవైపు ఇటీవల పోలీసులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. తమిళనాడు చెంగల్ పట్టుకు చెందిన కుటుంబం, బంధువులు పెళ్లి కోసం తిరుమల వస్తున్నారు. అయితే అందులో ఒకరి వద్ద పొగాకు ఉంది. తిరుమలకు పొగాకు తీసుకెళ్లొద్దని వారు సూచించాలి. కానీ సిబ్బంది దానిని చెత్తబుట్టలో వేయడంతో కోపమొచ్చింది. దీంతో వాగ్వివాదానికి దిగాడు. ఇంతలో బంధువులు కల్పించుకొని సర్దిచెప్పారు. కానీ బస్సు ఎక్కివెళ్తున్న భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి తెగబడ్డారు. ఒక్కడిని చేసి పిడిగుద్దులు కురిపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం కోసం వస్తే ఇదేంటని వారు ఆశ్చర్యపోయారు.












Click it and Unblock the Notifications