అలిపిరి-తిరుమల మెట్ల దారి మూసివేత మరో రెండునెలలు: శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలకు కాలినడకన చేరుకోవడానికి భక్తులు వినియోగించే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూతపడనుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలను సందర్శించే శ్రీవారి భక్తుల సంఖ్య నామమాత్రంగా ఉండటం వల్ల అలిపిరి-తిరుమల నడకమార్గం అభివృద్ధి పనులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతోన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు ఈ మార్గాన్ని మూసివేశారు.
దీన్ని మరో రెండు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నాటికి మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు ఇంకా మిగిలి ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ చివరి వారం నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉన్నందున.. ఈలోగా అలిపిరి-తిరుమల మెట్ల మార్గం అభివృద్ధి పనులను పూర్తి చెయ్యాలని టీటీడీ అధికారులు భావిస్తోన్నారు. శ్రీనివాస మంగాపురం వైపు ఉన్న శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోనే ఉంది.

కాలినడకన శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులు సెప్టెంబర్ వరకు శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని వినియోగించుకోవడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. తిరుమల-అలిపిరి మెట్లదారిని అభివృద్ధి చేయడానికి రెండు నెలల పాటు సమయం తీసుకున్నారు టీటీడీ అధికారులు. గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలపాటు మెట్ల మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించారు. 2020 సెప్టెంబర్ లో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మరమ్మత్తు పనులు చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 31వరకు అలిపిరి నడకమార్గంలో పైకప్పు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications