పవన్ది కారణం లేని పగ- భూమన ఫైర్..!!
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవ్వాళ తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. భారీ కాన్వాయ్తో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం పవన్ కల్యాణ్.. ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్పై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలను కొట్టే అధికారం సీఐకి ఎవరిచ్చారంటూ నిలదీశారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తోన్న పార్టీ నాయకులు, కార్యకర్తలను కొట్టడం ద్వారా రాజ్యాంగ ప్రాథమిక హక్కును సీఐ అంజు యాదవ్ ఉల్లంఘించారంటూ ఆరోపించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటారని అన్నారు.
నిరసనలను తెలియజేసే హక్కు తమకు రాజ్యాంగం ప్రసాదించిందని, ఎలాంటి అవాంఛనీయం సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా తాము ధర్నా చేస్తోంటే సీఐ అంజు యాదవ్ తమ కార్యకర్తను కొట్టారని చెప్పారు. సీఐ అంజు యాదవ్ వ్యవహారాన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వినతిపత్రాన్ని అందజేయడానికి మందీ మార్బలం, హంగు ఆర్భాటాలతో రావడాన్ని తప్పుపట్టారు. ఆధ్యాత్మిక నగరిపై పవన్ కల్యాణ్ దండెత్తాడంటూ విమర్శించారు. వినతిపత్రాన్ని ఇవ్వడానికి వచ్చే వారెవరూ ఇలా ప్రవర్తించబోరని చెప్పారు.
ప్రజలందరి మీద దాడి చేసినట్లుగా ప్రవర్తించడం అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా ఎంతసేపూ అధికార పార్టీపై, ప్రభుత్వంపై దాడి చేయడం సరికాదని అన్నారు. కారణం లేని పగతో పవన్ కల్యాణ్ రగిలిపోతున్నాడని ఆరోపించారు. ప్రతీరోజూ తమ పార్టీపై నిందలు వేయడాన్ని పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications