మీ బావమరిది బాలకృష్ణ ప్రధానిని తిట్టినప్పుడు నోరెత్తలేదే?: చంద్రబాబుపై బీజేపీ నేత ఫైర్
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు చేసిన ఆరోపణలు, విమర్శలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడాన్ని భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడి సమక్షంలోనే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన ఆరోపణలను వారు ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ ప్రధానిని తిట్టిన విషయాన్ని కూడా చంద్రబాబు తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వివరించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియాపై
వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు తనపై, పార్టీ క్యాడర్ పై బూతులు తిట్టారంటూ చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సైతం ఇచ్చారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఫేస్ బుక్, ట్విట్టర్ లల్లో చేసిన కామెంట్లకు సంబంధించిన వివరాలను ఆయన సేకరించి, స్లైడింగ్ లు వేసి మరీ ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంస్కార హీనులు అంటూ నిప్పులు చెరిగారు. దీన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తప్పుపట్టారు.

తాను తీసిన గోతిలో తానే పడ్డ చంద్రబాబు
నందమూరి బాలకృష్ణ సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రధానమంత్రి స్థాయి నాయకుడిపై బాలకృష్ణ పిచ్చి కూతలు కూసినప్పుడు ఎందుకు దండించలేదని ప్రశ్నించారు. అప్పట్లోనే బాలకృష్ణను చంద్రబాబు దండించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి తాను తీసిన గోతిలో తానే పడినట్టుగా తయారైందని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలోనే బాలకృష్ణ ప్రధానిని విమర్శించిన విషయాన్ని చంద్రబాబు విస్మరించారని అన్నారు.

నరేంద్ర మోడీని థర్డ్ జెండర్ తో పోల్చిన బాలకృష్ణ
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడలో ధర్మపోరాట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన బాలకృష్ణ ఏకంగా నరేంద్ర మోడీనే తన టార్గెట్ గా చేసుకున్నారు. ఆయనను థర్డ్ జెండర్ తో పోల్చారు. ఇష్టానుసారంగా పరిపాలించడానికి, రాజకీయ వ్యూహాలను అమలు చేయడానికి ఇది గుజరాత్ కాదని హెచ్చరించారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఏపీలో మోడీ ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. ఆ విమర్శలను విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా గుర్తు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ సంధించారు.












Click it and Unblock the Notifications