వల్లభనేని వంశీ అనుచరుల అక్రమ మైనింగ్ - హైకోర్టు ఆదేశాలు..!!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల పైన నమోదైన కేసులో హైకోర్టు సీరియస్ గా స్పందించింది. వారు చేస్తున్న పనులను నిలువరించాలని ఆదేశించింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలతో పలువురు వ్యాపారులు గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని, దేవాలయాన్నీ కూల్చేశారని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయ పరిసరాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాల తో పాటుగా చిన్నతరహా ఖనిజాల వెలికితీతను అడ్డుకోవాలని పిటీషన్ దాఖలైంది.

హైకోర్టులో పిల్ దాఖలు
గతంలో గుడి ఉన్నచోటే విగ్రహాలను పునఃప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని పైన విచారించిన న్యాయస్థానం గనుల తవ్వకాలు తక్షణమే నిలిపేయాలని, చెట్ల కూల్చివేతను నిలువరించాలని ఆదేశించింది. కొండపై కొత్త ఆలయ పనులను ఆపాలని నిర్దేశించింది. గనుల తవ్వకాల కోసం దేవుళ్ల విగ్రహాలనూ మార్చేస్తుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించింది. ఎమ్మెల్యే వంశీ ఆదేశాల మేరకే లక్ష్మణరావు, ఓలుపల్లి మోహనరంగారావు, కె.శేషుకుమార్తో పాటు పలువురు వ్యాపారులు గనుల అక్రమ తవ్వకాలు జరిపినట్లు పిటీషనర్ కోర్టుకు నివేదించారు. బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లను కూల్చివేశారని నివేదించారు.

హైకోర్టు ధర్మాసం కీలక ఆదేశాలు
ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెం, చిక్కవరం గ్రామం ఆర్ఎస్ -2 పరిధిలో.. కోటగట్టుపై అనధికారికంగా నిర్మిస్తున దేవాలయాన్ని అడ్డుకోవాలని పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. బహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం ఉన్నచోటే విగ్రహాలను పునఃప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. గతంలో పిటిషనర్ రాసిన లేఖను సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి.. కొండ దిగువ భాగంలోని దేవాలయంలోనే విగ్రహాలను పునఃప్రతిష్టించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాదనల సమయంలో కోర్టుకు నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం తక్షణమే గనుల తవ్వకాలు నిలిపేయాలని, చెట్ల కూల్చివేతను నిలువరించాలని ఆదేశించింది.

2017 నాటివంటున్న ప్రభుత్వ న్యాయవాది
గనుల తవ్వకాల కోసం దేవుళ్ల విగ్రహాలను కూడా మార్చేస్తుంటే దేవాదాయశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. గనుల శాఖ తరఫున స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, కోర్టు ముందు పిటిషనర్ ఉంచిన ఫోటోలు 2017 నాటివని చెప్పారు. వివరాల సమర్పణకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను నాలుగు వారాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications