వైసీపీ శ్రేణుల దాడులకు భయపడి ఊళ్ళు వదిలి వెళ్ళాలా ? ఆక్రోశం వెళ్ళగక్కిన చంద్రబాబు
ఏపీలో వైసిపి సర్కార్ పరిపాలన తీరుపై మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు పాలిచ్చే ఆవును వదిలి పెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని రాష్ట్ర ప్రజలను మరొకసారి ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ శ్రేణుల దాడులకు భయపడి ఊళ్ళు వదిలి వెళ్ళాలా అని చంద్రబాబు ఆక్రోశం వెళ్ళగక్కారు .

ప్రజలు బాధపడుతుంటే చూడలేకపోతున్నానన్న చంద్రబాబు
గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు అన్నీ చంద్రబాబే చేశాడు, ఇంకొక ఆయన వస్తాడు.. పొడుస్తాడని అనుకున్నారు. కానీ ఆయన చేసేదేమీ లేదని తేల్చి చెప్పారు. తన కష్టాన్ని ప్రజలు గుర్తించలేక పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరినీ అడుగుతున్నాం.. ఎక్కడ తాము తప్పు చేశామో చెప్పాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తన తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతిని చంపేస్తున్నారని మండిపాటు .. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకం చేశారన్న బాబు
అమరావతి కి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, అమరావతి నిర్మాణం ఏ విధంగా చేస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కు దీటుగా అమరావతి ఉండాలని తాము నిర్ణయించి నిర్మాణం చేపడితే ఇప్పుడు అమరావతి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని అమరావతి మీద కక్ష కట్టి దానిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్ కు దీటుగా అమరావతి అభివృద్ధి చెందితే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అని భావిస్తే ఇప్పుడు ఆ ఆశ కూడా అడియాస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు తక్కువ వడ్డీలకు నిధులు ఇస్తే మన రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తే ప్రస్తుత ఏపీ సర్కార్ ఆ నిధులు రాకుండా పోగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలపై దాడులు హేయమైన చర్య.. మీకు భయపడి ఊళ్ళు వదిలి వెళ్ళాలా అని ప్రశ్నించిన బాబు
ఇక అంతే కాదు ఏపీలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు బెదిరిస్తే టీడీపీ కార్యకర్తలు ఊళ్లు వదిలేసి వెళ్లాలా? అని ఆయన ప్రశ్నించారు. రేపు తాము అధికారంలోకి వస్తే వాళ్లు కూడా గ్రామాలు వదిలిపెట్టి పోతారా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. ఏదైనా ఊళ్లో టీడీపీ కార్యకర్తలకు భద్రత లేదని భావిస్తే తాను ఆ ఊళ్లోనే బస చేస్తానని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగి వెళతానని చెప్పారు చంద్రబాబు. ఇక అంతే కాదు మొన్నటి వరకు టీడీపీ అధికారంలో ఉందని తాము అలాగే ప్రవర్తిస్తే మీరు ఎక్కడ ఉండేవాళ్లం టూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులను ఉద్దేశించి మీకు బాధ్యత లేదా.. ఈ దాడులను ఆపలేరా అంటూ నిలదీశారు. ఇది తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చి చెప్పిన చంద్రబాబు తాను కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మొత్తానికి ప్రస్తుత వైసిపి పాలనలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా తయారవుతుందని చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications