రిజల్ట్స్ డే: జగన్కు కొత్త తలనొప్పి: కరోనా కాలంలో వైసీపీ విజయోత్సవాలు.. వారం రోజుల పాటు
అమరావతి: మరో మూడురోజులు. ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తి కాబోతోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించడానికి.. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికీ కారణమైన రోజు అది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరమైన పలు కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. 23వ తేదీన విజయోత్సవాలకు పిలుపునిచ్చింది.

లాక్డౌన్ ఉన్నా పార్టీ విజయోత్సవ కార్యక్రమాలకు ప్లాన్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. ఈ విజయోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి సన్నాహాలను చేపట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ మేరకు అన్ని స్థాయిల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేకంగా కొన్ని సూచలను జారీ చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు పార్టీ నాయకులకు కొన్ని సూచలను జారీ చేశారు.

వైసీపీ భారీ మెజారిటీని అప్పగించిన రోజు..
గత ఏడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. 50 శాతానికి పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. 25 లోక్సభ స్థానాలు ఉండగా.. 22 చోట్ల జయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమతమైంది. మూడు లోకసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 51 అసెంబ్లీ స్థానాలు ఉన్నరాయలసీమలో 49 సీట్లను గెలుచుకోగలిగిందంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విజయోత్సవ కార్యక్రమాలకు పిలుపు..
రాష్ట్రం మొత్తం ఇదే తరహా ట్రెండ్ కనిపించింది. తాము అధికారంలోకి రావడానికి కారణమైన మే 23వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి వైసీపీ నాయకులు సన్నాహాలు చేపట్టారు. విజయోత్సవ దినంగా జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామం, ప్రతి మండలంలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. పార్టీ క్యాడర్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. లాక్డౌన్ అమల్లో ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరి ఇళ్ల వద్ద వారు విజయోత్సవ కార్యక్రమాలను జరుపుకోవాలని అన్నారు.

తొలి ఏడాదే 90 శాతం హామీల అమలు..
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అనేక మార్పులను తీసుకొచ్చామని చెప్పారు. తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం నెరవేర్చిన ప్రభుత్వంగా గుర్తింపు సాధించామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచని 40 కొత్త పథకాలను అమలు పరుస్తూ, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.

23వ తేదీన
23వ తేదీన ప్రజా ప్రతినిధులు అందరూ తమ తమ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో జెండాలను ఎగుర వేయాలని సూచించారు. మండల స్థాయిలో పార్టీ జెండా ఎగరాలని అన్నారు. పేదలకు పండ్లను పంపిణీ చేయాలని సూచించారు. తమ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ పధకాల ద్వారా లబ్దిపొందిన వారి డేటాను సేకరించాలని చెప్పారు. ఏడాది పాలన, ప్రగతి పథకాలపై ఇప్పటికే ప్రభుత్వం వారం రోజుల షెడ్యూల్ను రూపొందించిందని, దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు సాగాలని చెప్పారు.

నిబంధనలకు లోబడి సాధ్యమేనా..
పార్టీ నాయకత్వం తాజాగా తలపెట్టిన ఈ విజయోత్సవ కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరికొత్తగా తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. లాక్డౌన్ వల్ల పస్తులు ఉంటోన్న పేద ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేలపైనే హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేసిన కొందరు ప్రత్యర్థులు కొత్తగా ప్రతిపాదించిన పార్టీ జెండా ఆవిష్కరణల కార్యక్రమం నిర్వహణను చూస్తూ ఉండబోరనే అభిప్రాయం వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications